వారికి టిక్కెట్లు ఇస్తారా?: పవన్ కళ్యాణ్కు మరకే అవుతుంది
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పవన్ సరే.. రాష్ట్రవ్యాప్తంగా పోటీపై ఏమిటని.. అప్పుడే చర్చలు జరుగుతున్నాయి.
చదవండి: టిడిపితో జూనియర్ ఎన్టీఆర్ కలుస్తారా?
ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు, అనుభవం.. ఇలా ఎన్నో కావాల్సి ఉంటుంది. పార్టీ నడిపేందుకే తన వద్ద డబ్బులు లేవన్న పవన్.. అభ్యర్థులకు పార్టీ తరఫున అవసరమైన మొత్తాన్ని సమకూర్చుతాడని భావించలేమని అంటున్నారు.
ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు టిక్కెట్లు ఇస్తారా?
ఇలాంటి సమయంలో 2019 ఎన్నికల సమయంలో పలుచోట్ల టిడిపి, బిజెపి, వైసిపిలలో టిక్కెట్లు దొరకక, అసంతృప్తి బాట పట్టే వారికి జనసేన టిక్కెట్లు ఇస్తుందా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం జనసేన అంటే కేవలం పవన్ మాత్రమే గుర్తుకు వస్తారు.
పోటీ చేసే స్థాయికి ఎంతమంది ఎదుగుతారు?
పార్టీ సంస్థాగతంగా ఇప్పడిప్పుడే ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో మరో ఒకటిన్నర రెండేళ్లలో పోటీ చేసి గెలవగలిగే వాళ్లుగా ఎంతమంది ఎదుగుతారనేది ప్రశ్నే. కాబట్టి అప్పటి పరిస్థితులను బట్టి ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్తులకు టిక్కెట్లు ఇవ్వవచ్చునని అంటున్నారు.
అది పవన్ కళ్యాణ్కు మరక!
ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్తుల కోసం వేచి చూస్తే, వారికి ఆ సమయానికి టిక్కెట్లు ఇస్తే అది పవన్ కళ్యాణ్కు మరక అవుతుందని కూడా అంటున్నారు. అంతేకాదు, ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా వెళ్తున్న పవన్, గెలుపోటములు పట్టించుకోని పవన్.. అలా చేయడనేదే ఎక్కువ మంది అభిప్రాయం. ఓటమికి సిద్ధపడే తాను పోటీ చేస్తున్నానని పవన్ చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం.
వారికే టిక్కెట్లు
అయితే, ఇప్పుడు జనసేన కార్యకర్తల ఎంపిక జరుగుతోంది. అందులో నుంచి కొందరికి టిక్కెట్లు వస్తాయనే వాదనలు ఉన్నాయి. వారు ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్తారు. అంతేకాకుండా, డబ్బు యావ లేని వాళ్లకు, అవినీతికి పాల్పడని వాళ్లకే టిక్కెట్లు అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.