అధికారంలో ఉంది: టిడిపిలో చేరడంపై ఆనం వ్యాఖ్య, బాబు గ్రీన్ సిగ్నల్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అందుకే తాము ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం చెప్పారు.
ఆనం సోదరులు (ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి) సైకిల్ ఎక్కేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఆయన శుక్రవారం స్పందించారు. అభివృద్ధి అధికారంలో ఉన్న టిడిపితోనే సాధ్యమన్నారు. అందుకే వెళ్తున్నామని చెప్పారు.
తాము పదవుల కోసం వెంపర్లాడటం లేదని స్పష్టం చేశారు. రేపటి భవిష్యత్తు కోసం టిడిపిలో చేరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు పోరాటంతో రాజకీయాలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2.8 శాతానికి పడిపోయిందన్నారు.
నిన్న కూడా ఆయన మాట్లాడారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం లేదని, టిడిపిలో ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. టిడిపి అధ్యక్షులు మాతో సంప్రదింపులు జరిపారన్నారు. మంత్రి నారాయణతో విభేదాల్లేవని చెప్పారు. కాగా, ఆనం సోదరుల చేరికకు చంద్రబాబు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.