ఆ భయంతోనే చంద్రబాబు హైద్రాబాద్ లో ఇల్లు నిర్మాణం, గుట్టు విప్పిన రోజా
చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ హైద్రాబాద్ లో ఇల్లును ఎందుకు కట్టుకొన్నారో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.
హైదరాబాద్: చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ హైద్రాబాద్ లో ఇల్లును ఎందుకు కట్టుకొన్నారో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో ఇల్లు కట్టుకొన్నారని ఆమె ఎద్దేవా చేశారు.
గురువారం నాడు ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీస సౌకర్యాలు లేని అమరావతికి అందరిని బెదిరించి రప్పించారని, అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో కొత్త భవంతిని నిర్మించడంలో ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశ్యంతోనే ముందు జాగ్రత్తగా ఇల్లు నిర్మించుకొన్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఏటా రూ.33 లక్షల ఆదాయం వస్తోందని చెప్పుకొనే చంద్రబాబునాయుడు కోట్లాది రూపాయాలను ఖర్చుచేసి ఇల్లు ఎలా కట్టారని ఆమె ప్రశ్నించారు.
చేతికి ఉంగరాలు, వాచీ లేవని చెప్పుకొంటారని బాబుపై ఆమె వ్యంగ్యాస్త్రాలను సంధించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో కెల్లా నంబర్ వన్ అవినీతి పరుడు చంద్రబాబునాయుడేనని ఆమె ఆరోపించారు.
బాబు వస్తే జాబు వస్తోందని ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు తన కొడుకుకు మంత్రి పదవిని కట్టబెట్టారని, యువతకు మాత్రం మొడించేయి చూపారని ఆమె విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన బాబు వైసీపీ అధినేత జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
స్పీకర్ కూడ హోదాను మరిచి టిడిపి కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. వైసీపి ఎమ్మెల్యేలకు మంత్రిపదవిని కట్టబెట్టే విషయమై గవర్నర్ ప్రమాణం చేయించడం బాధాకరమన్నారు.