బాలకృష్ణ గైర్హాజరు: ఎందుకు రావడం లేదంటూ ప్రశ్న?
అనంతపురం: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైర్వాజరుపై పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు రావడం లేదని జెడ్పీటీసీ సభ్యుడు రవి ప్రశ్నించాడు.
దీంతో వెంటనే మంత్రి పల్లె రఘనాథరెడ్డి కలగజేసుకుని పని ఒత్తిడి కారణంగా కొందరు ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కాకపోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీయేనని చెప్పారు. దీంతో మంత్రి సమాధానం నచ్చని జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు బాలకృష్ణ మాత్రం తన సొంత నియోజకవర్గంలో ఈ నెల 27,28న నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాల నిర్వహణలో మునిగిపోయారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఉత్సవాలకు బాలకృష్ణ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
మొన్నటి వరకు ఏపీలోని విశాఖ, విజయవాడలతో పాటు హైదరాబాద్లోని పలువురు ప్రముఖులను లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానించిన బాలకృష్ణ తాజాగా ఢిల్లీకి చేరారు. కేంద్రంలో ఇప్పటికే వెంకయ్యనాయుడు సహా పలు కీలక మంత్రులకు ఆయన లేపాక్షి ఆహ్వానాలను అందించారు.
తాజాగా గురువారం ఆయన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేపాక్షి ఉత్సవాలకు రావాలని ఆహ్వానం అందించారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబులతో కలిసి గడ్కరీ వద్దకెళ్లిన బాలకృష్ణ, ఆహ్వాన పత్రికను అందించారు.
అనంతరం తన నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి నుంచి కర్ణాటకలోని యలహంకకు దారి తీసే రోడ్డుకు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న జాతీయ హోదా ప్రకటనను ప్రస్తావించారు. బాలకృష్ణ విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సోమందేపల్లి-యలహంక రోడ్డుకు జాతీయ హోదా ప్రకటించేందుకు గడ్కరీ అంగీకరించారని సమాచారం. త్వరలోనే ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను చేయనున్నారు.