అందరూ ఓకె.. ఆ ఒక్క మంత్రినే బాబు హ్యాండిల్ చేయలేకపోతున్నారట!?
విజయవాడ : ప్రభుత్వాదేశాల మేరకు వినయ విధేయతలతో నడుచుకునే మంత్రులు కొందరైతే.. ప్రభుత్వాదేశాలతో సంబంధం లేకుండా సొంత అభిప్రాయాన్ని వినిపించడంలో ఏమాత్రం తడబడని మంత్రులు మరికొందరు. ప్రభుత్వ విధానాల్లో కనిపించే లోపాలను చెడామడా కడిగిపారేసే రకం అన్నమాట. ఏపీ దేవాదాయశాఖ మంత్రి మంత్రి మాణిక్యాలరావు కూడా ఈ రెండో కోవకు చెందినవారే.
అందుకే.. ఏపీ మంత్రులందరినీ తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకునే చంద్రబాబు, ఒక్క మాణిక్యాలరావు విషయంలో మాత్రం మొండి పట్టుదలకు పోవట్లేదట. మిగతా మంత్రులందరికీ ఎన్ని అదనపు బాధ్యతలు అప్పగించినా సరే.. మాణిక్యాలరావుకు మాత్రం మరో అదనపు అప్పగించజెప్పడానికి చంద్రబాబే తటపటాయించే పరిస్థితి.
చాలా సందర్బాల్లో సీఎం చంద్రబాబు ఒక మాట అంటుంటారు. రాష్ట్రం కోసం అలుపెరగకుండా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నానని. తన స్పీడ్ ను అందుకోవడంలో మంత్రులు వెనుకబడుతున్నారన్న విషయాన్ని కూడా పరోక్షంగా ఆయన చాలాసార్లే ప్రస్తావించారు. అందుకే.. మంత్రులతో సాధ్యమైనంత ఎక్కువ పనిని రాబట్టుకునేలా చంద్రబాబు ప్లాన్ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే.. ఆయా మంత్రులకు అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు చంద్రబాబు. జిల్లాల పర్యవేక్షణతో పాటు పాలనా పరమైన కొన్ని బాధ్యతలను మంత్రులకు అదనంగా కేటాయించారు. అయితే.. కేబినెట్ లో ఉన్న అందరు మంత్రులకు ఏదో ఒక అదనపు బాధ్యత అప్పగిస్తోన్న చంద్రబాబు, ఒక్క మాణిక్యాలరావుకు మాత్రం ఇంకో పని చెప్పడానికి సాహసించట్లేదట.
ముందునుంచి ముక్కుసూటిగా వ్యవహరించే మాణిక్యాలరావు.. తేడా వస్తే..మిత్రపక్షం అన్న ఆలోచనలు పక్కనబెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు కూడా ఆయన్నొక్కరినే అదనపు బాధ్యతల నుంచి మినహాయిస్తున్నారనే వాదన ఉంది. మాణిక్యాలరావు బీజేపీ కాబట్టి చంద్రబాబు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు గానీ.. అదే టీడీపీలో ఉండుంటేనా..! మాణిక్యాలరావును కూడా చంద్రబాబు తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకునేవారనేది మరో వాదన.