వెంకయ్యను చంద్రబాబు ఎందుకు కలవలేదు: కారణం అదేనా?
విజయవాడ: ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. ఇది రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యకరమైన విషయమే.
వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం లోకానికి తెలిసిందే. అయినా చంద్రబాబు వెంకయ్యకు దూరంగా ఉన్నారంటే బలమైన కారణం ఉండపోదనే చర్చ సాగుతోంది. నిజానికి, చిన్నపాటి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరువురు కలిసే హాజరవుతూ వచ్చారు.
వెంకయ్య నాయుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పాలని చంద్రబాబు తొలుత అనుకున్నారని సమాచారం. అయితే, వెంటనే ఆయన తన మనసు మార్చుకున్నారు.
వెంకయ్యనే చెప్పారు....
ఉప రాష్ట్రపతిగా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై వెంకయ్య నాయుడు బహిరంగంగాన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ చెప్పారు కాబట్టి అంగీకరించక తప్పలేదని కూడా ఆయన అన్నారు. తనను వ్యక్తిగతంగా కలవవద్దని వెంకయ్య నాయుడే చంద్రబాబుకు చెప్పారన అంటున్నారు. తమ ఇరువురి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయన అలా చెప్పారని అంటున్నారు.
Recommended Video
వారి స్నేహం ఎంతదంటే..
పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి మధ్య స్నేహం కొనసాగుతూ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది మరింతగా బలపడింది. అయితే, వారి స్నేహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులం కోణంతో వారి స్నేహానికి ముడిపెట్టి వారిపై విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్ర సాయం రాబట్టడంలో వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే వెంకయ్య ఆ పని చేశారని అంటారు.
వెంకయ్యపై ఇలా...
వెంకయ్య నాయుడు బిజెపి నాయకుడి మాదిరిగా కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడి మాదిరిగానే వ్యవహరిస్తూ వస్తున్నారనే వ్యాఖ్యలు కూడా పెద్ద యెత్తున వచ్చాయి. వెంకయ్య తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే నిందలును కూడా మోయాల్సి వచ్చింది.
జగన్ పార్టీపై....
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై వెంకయ్య నాయుడు తానో జాతీయ నాయకుడిననే విషయం మరిచిపోయి విమర్శలు చేశారనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు కోసమే ఆయన అలా చేశారని కూడా అంటారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడాన్ని వెంకయ్య నాయుడు బలపరిచినట్లు కూడా చెబుతారు.
ఆర్ఎస్ఎస్ చెవిన కూడా...
చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి మధ్య ఉన్న బంధం గురించి ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి కూడా చేరిందన అంటున్నారు. అందువల్లనే పాము చావకుండా కర్ర విరగకుండా ఆయనను ఉప రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపిక చేశారని అంటున్నారు. వెంకయ్య నాయుడిపై వచ్చిన విమర్శలను ధ్రువీకరించుకున్న తర్వాతనే వెంకయ్య నాయుడిని ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని మోడీ, అమిత్ షా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
దానివల్లనే....
చంద్రబాబుతో స్నేహం క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలనే తన ఇష్టానికి భంగం వాటిల్లిందని, క్రియా శీలక రాజకీయాలతో సంబంధం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారని వెంకయ్య నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లనే తనను వ్యక్తిగతంగా కలుసుకోవద్దని ఆయన చంద్రబాబుకు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. వెంకయ్య నాయుడి ప్రమాణ స్వీకారానికి మాత్రం చంద్రబాబు హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.