70కి.మీ. నడవాలా: కేసీఆర్పై షబ్బీర్ నిప్పులు, 'రాజయ్య'పై చాడ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతోందన్నారు. చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలిస్తే పేదలు 70 కిలోమీటర్లు నడిచి వెళ్తారా అని ప్రశ్నించారు.
వికారాబాద్ అడవులకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం పదకొండు పీజీ సీట్లను కోల్పోవలసి ఉంటుందని చెప్పారు. ఆసుపత్రిని అనంతగిరికి తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పారు. చెస్ట్ ఆసుపత్రిని తరలిస్తే వచ్చే లాభమేమిటని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రాష్ట్రాన్ని తన సొంత జాగీరు అనుకుంటున్నారా అని నిలదీశారు.
రాజయ్య తొలగింపు సరైన రీతిలో లేదు: చాడ
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తొలగింపు సరైన రీతిలో లేదని లెఫ్ట్ పార్టీ నేత చాడ వెంకట రెడ్డి అన్నారు. చెస్ట్ ఆసుపత్రిని వికారాబాదుకు తరలించడం ఏమాత్రం సరికాదన్నారు.
గ్రేటర్ వరంగల్ ఏర్పాటుకు తెలంగాణ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని గ్రేటర్ వరంగల్గా చేయాలని నిర్ణయించింది. కాగా, టీపీసీసీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చక్రపాణి ముఖ్యమంత్రితో చర్చించారు. మరోవైపు కేసీఆర్తో ప్రభుత్వ వైద్యులు భేటీ అయ్యారు. చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై కేసీఆర్తో చర్చించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రి తరలింపుపై సీఎంతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని చెప్పారు.
వరంగల్ను హెరిటేజ్ నగరంగా.. దత్తాత్రేయ
వరంగల్ నగరాన్ని హెరిటేజ్ నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం అన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.