మొహమాటం లేదు, కేసీఆర్-మోడీని ఎందుకు గెలిపించారు: చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వారి కులాలను చూసి ప్రజలు ఓట్లు వేశారా? అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రశ్నించారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వారి కులాలను చూసి ప్రజలు ఓట్లు వేశారా? అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రశ్నించారు. బెజవాడలో జరుగుతున్న టిడిపి వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు.
పదవులు నా నిర్ణయం
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్కు విరుద్ధంగా ప్రకటనలు ఇస్తే బాగుండదని హెచ్చరించారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది నా నిర్ణయం అని చెప్పారు. మొహమాటానికి వెళ్లి పదవులు ఇస్తే పార్టీకే నష్టమని చెప్పారు. నాలుగైదు జిల్లాల్లో క్రమశిక్షణారాహిత్యం మొదలైందన్నారు.
మంత్రులకు హెచ్చరిక, ఇంట్లో కూర్చోవద్దని..
మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేస్తామంటే కుదరదని బాబు చెప్పారు. ప్రభుత్వ పథకాలకు పార్టీ ఓనర్ షిప్ తీసుకోవాలన్నారు. ఎన్ని మంచి పనులు చేసినా ప్రజల్లోకి తీసుకు వెళ్లకుంటే పార్టీకి లాభం లేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు నేతల మనస్తత్వం చూశానన్నారు.
కేసీఆర్, మోడీలకు ఓట్లు ఎలా వేశారు?
బంధువులు, కులాలను చూసి ప్రజలు ఓట్లు వేయరని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కేసీఆర్కు కులం చూసి ఓట్లు వేశారా? ప్రధాని నరేంద్ర మోడీని కులం చూసి గెలిపించారా? అని వ్యాఖ్యానించారు. మంచి పనులు చేస్తేనే ప్రజలు గెలిపిస్తారని అభిప్రాయపడ్డారు. తద్వారా చంద్రబాబు.. మోడీతో పాటు కేసీఆర్ మంచి చేశారని వ్యాఖ్యానించినట్లే అంటున్నారు.
ఒంటెత్తుపోకడలు వద్దు
కొందరు ఎమ్మెల్యేలు ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నిబంధనలు ఉల్లంగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే, ప్రజలు నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్నారు. సేవ అందిస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు.