కేసీఆర్ దీక్ష చేస్తే మేంకూడా: గాలి, రేవంత్ను ఇరికించే కుట్ర: జూపూడి
హైదరాబాద్: పీవీ తెలంగాణ బిడ్డ కావడం తమకు ఎంతో గర్వకారణమని చెప్పిన కేసీఆర్ ఆయన జయంతి వేడుకలకు ఎందుకు హాజరు కాలేదని ఏపీ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం ప్రశ్నించారు. సెక్షన్ 8 అమలు చేస్తే కేసీఆర్ దీక్ష చేస్తానని చెబుతున్నారని, తాము కూడా దీక్ష చేస్తామన్నారు.
ఉమ్మడి సంస్థల్లో ఏపీకి అన్యాయం జరుగుతోందన్నారు. ఏపీ ఉద్యోగులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సిందే అన్నారు. దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు పట్టిన శని అన్నారు.
రాష్ట్రం ముక్కలు కావడానికి కారణం ఆయనే అన్నారు. పీవీ నరసింహరావును కాంగ్రెస్ ఎన్నో విధాలుగా అవమానించిందన్నారు. పీవీ జయంతికి కేసీఆర్ రాలేదని, ఇదేనా కేసీఆర్ పీవీకి ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు.
రేవంత్ను ఇరికించే కుట్ర: జూపూడి
రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు రాజకీయ కుట్ర చేశారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు ఆరోపించారు. వ్యవస్థలను గందరగోళపరిచేందుకు స్టీఫెన్ సన్ను పావుగా వాడుకుంటున్నారన్నారు.
ఫాంహౌస్లో స్టీఫెన్తో కేసీఆర్ మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందన్నారు. టీడీపీకి న్యాయవ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉందన్నారు. టీఆర్ఎస్, వైసీపీలు కలిసి చేస్తున్న కుట్రల కారణంగా ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందన్నారు.
రైతులపై శ్రద్ధ లేదు: నర్సారెడ్డి
కేసీఆర్కు ఫాంహౌస్ పైన ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని తెలంగాణ టీడీపీ నేత అరికెల నర్సిరెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ కింద రైతులకు కేవలం రూ.1200 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు.
సీఎం చెప్పే మాటలతో తమకు సంబంధంలేదని బ్యాంకర్లు చెబుతున్నారన్నారు. మిషన్ కాకతీయలో పది శాతం పనులు మాత్రమే జరిగాయని, నిధులు మాత్రం పూర్తిగా తీసుకున్నారన్నారు.
ఆ సంస్థలను విభజించాలి: శ్రీనివాస్ గౌడ్
9,10 షెడ్యూల్లోని సంస్థలను విభజించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ షీలాబేడీ కమిటీ పనిలో జాప్యం జరుగుతోందన్నారు. 9వ షెడ్యూల్లోని సంస్థల్లోకి ఏపీ అధికారులు అక్రమంగా వస్తున్నారన్నారు.