అందుకే: కృష్ణపట్నంకు కేసీఆర్ నో వెనుక, ఆరా తీసిన చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొద్ది రోజులుగా తమకు కృష్ణపట్నం విద్యుత్ వద్దని చెబుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో అధికారులు సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగరేణిలో వాటా ఆడుగుతామనే కృష్ణపట్నం వద్దని ఉండవచ్చునని చెప్పారు.
సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో అదిలాబాదులో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల ప్రాజెక్టు విద్యుత్లో వాటా ఆడుగుతారనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణపట్నం విద్యుత్ వాటా వదులుకోవడానికి సిద్ధపడి ఉండవచ్చునని బాబుతో జరిగిన సమావేశంలో ఏపీ విద్యుత్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఏపీలో విద్యుత్ పరిస్థితి పైన ఆయన సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు.
కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లలో జూన్ నుండి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదన చేయవచ్చునని, ఆ సమయానికి హిందూజా ప్రాజెక్టులోని తొలి యూనిట్ అందుబాటులోకి వస్తుందని ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్కో ఇంఛార్జ్ సీఎండీ విజయానంద్ తెలిపారు. కృష్ణపట్నం ప్రాజెక్టులో యూనిట్ ధర రూ.4.40గా వార్షిక ఆదాయ అవసర నివేదికలో పేర్కొన్నామని చెప్పారు.
దీంతో, తెలంగాణ కృష్ణపట్నం విద్యుత్ వద్దని లేఖ రాసిందని తెలిపారు. దానిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. దానిపై అధికారి స్పందిస్తూ.. సింగరేణి బొగ్గు గనులు పక్కనే ఉన్నందున అదిలాబాదులోని సింగరేణి విద్యుత్ ప్రాజెక్టుపై రవాణా భారం ఉండదని, దీనివల్ల కృష్ణపట్నంతో పోలిస్తే కొద్దిగా ధర తక్కువ ఉండే అవకాశముందని చెప్పారని తెలుస్తోంది.
అందుకే సింగరేణి వద్యుత్లో ఏపీకి వాటా ఇవ్వడం ఇష్టం లేకే కృష్ణపట్నం ప్రాజెక్టులో వాటా తీసుకునే విషయంలో తెలంగాణ విముఖత ప్రదర్శించి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ వాటాల వివాద అంశం కేంద్ర విద్యుత్ అథారిటీ ముందుందని, దాని నిర్ణయానికి కట్టుబడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కరెంట్ కష్టాలు తగ్గించాలని చంద్రబాబు విద్యుత్ అధికారులను ఆదేశించారు.