చంద్రబాబు-మోడీపై ఆగ్రహం: లెఫ్ట్ నేతలు పవన్ కళ్యాణ్ను ఎందుకు కలిశారంటే..
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను గురువారం నాడు సిపిఐ నాయకులు కలిశారు. పవన్ తాము ఏం మాట్లాడామనే విషయాన్ని సిపిఐ నేత రామకృష్ణ శుక్రవారం నాడు విలేకరులకు తెలియజేశారు.
విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను గురువారం నాడు సిపిఐ నాయకులు కలిశారు. పవన్ తాము ఏం మాట్లాడామనే విషయాన్ని సిపిఐ నేత రామకృష్ణ శుక్రవారం నాడు విలేకరులకు తెలియజేశారు.
ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. బిజెపి, టిడిపి ప్రభుత్వ విధానాల పైన పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని రామకృష్ణ తెలిపారు. తాము రాజకీయ పొత్తుల కోసం పవన్ కళ్యాణ్తో భేటీ కాలేదని తేల్చి చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాడేందుకు ఏకం కావాలని ఈ సందర్భంగా రామకృష్ణ పిలుపునిచ్చారు. కాగా, ఏపీలో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల పైన పవన్ కళ్యాణ్తో సిపిఐ నేతలు గురువారం చర్చించిన విషయం తెలిసిందే.
గురువారం నాడు పవన్తో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐటీయూసీ ఏపీ కౌన్సెల్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ చంద్రశేఖర రావు కూడా పాల్గొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, రాష్ట్రంలో భూసేకరణ కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు జనసేన పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
భావసారూప్యత కలిగిన ప్రజా సమస్యల పైన జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయమై ఆలోచన చేసినట్లు అప్పుడు రామకృష్ణ తెలిపారు. సిపిఎం నేతలతో కలిసి మరోసారి పవన్తో భేటీ అవుతామన్నారు. ఇది స్నేహపూర్వక భేటీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.