అరటిచెట్టుతో 'నిషిత్'కు వివాహం, బోరుమన్న కుటుంబం.. పెన్నా ఒడ్డునే ఎందుకంటే?
స్నానం, అరటిచెట్టుతో వివాహం అనంతరం 9.40 నిమిషాలకు నిషిత్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన శకటంలోకి చేర్చారు.
నెల్లూరు: కుటుంబ సభ్యుల విషన్న వదనాల నడుమ నిషిత్ నారాయణ అంత్యక్రియలు పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే దహన సంస్కరాలకు సంబంధించి.. ఎక్కడ జరపాలనే దానిపై తొలుత కొంత సందిగ్ధత ఏర్పడింది.
లైఫ్లో స్పీడ్ ఉండాలనేవాడు.. అంతే స్పీడ్గా వెళ్లిపోయాడు(నిషిత్ ఫోటోలు)
నారాయణ వైద్య కళాశాలలోనే అంత్యక్రియలు పూర్తి చేయాలని తొలుత భావించినప్పటికీ.. పండితుల సలహా మేరకు ఆ ఆలోచన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం నిలయమైన చోట దహన సంస్కారాలు చేస్తే మంచిదని పండితులు సూచించినట్లు సమాచారం. దీంతో పెన్నా తీరంలో నిషిత్ అంత్యక్రియలు నిర్వహించడానికి మంత్రి నారాయణ మొగ్గు చూపారు.
గతంలో చాలామందికి ఇక్కడే:
పంచభూతాలకు వేదికగా పెన్నా తీరం ఉండటంతో.. దహన సంస్కారాలకు ఇదే అనువైన ప్రాంతమని నెల్లూరులో చాలామంది భావిస్తారు. గతంలో చాలామంది ప్రముఖుల దహన సంస్కారాలు కూడా ఇక్కడ నిర్వహించారు. దీంతో నిషిత్ అంత్యక్రియల క్రతువును పెన్నా గర్భంలో నిర్వహించడానికే కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అరటిచెట్టుతో పెళ్లి:
సాంప్రదాయం ప్రకారం.. అవివాహితులు మరణిస్తే వారికి అరటిచెట్టుతో పెళ్లి చేస్తారు. దీంతో దహన సంస్కారాలకు ముందు నిషిత్ నారాయణకు తుది స్నానం క్రతువు ముగిసిన తర్వాత అరటిచెట్టుతో వివాహం జరిపించారు. నిజ జీవితంలో పెళ్లి చేసుకోవాల్సిన బిడ్డ.. ఇలా అంత్యక్రియల క్రతువులో అరటిచెట్టుతో పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు దు:ఖం ఆపుకోలేకపోయారు.
పూలతో అలంకరించిన శకటంలో:
స్నానం, అరటిచెట్టుతో వివాహం అనంతరం 9.40 నిమిషాలకు నిషిత్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన శకటంలోకి చేర్చారు. మంత్రులు నారాయణ, లోకేష్ అదే శకటంలో ప్రయాణించారు. ముత్తుకూరు రోడ్డు నుంచి హరనాథపురం సర్కిల్, మినీ బైపాస్ రోడ్డు మీదుగా అంతిమయాత్ర సాగింది.
జనసంద్రంగా పెన్నా తీరం:
అంతిమయాత్రలో నారాయణ ఉద్యోగులు, టీడీపీ నాయకులు, నెల్లూరు వాసులు భారీ ఎత్తున పాల్గొనడంతో పెన్నా తీరం జనసంద్రంగా మారిపోయింది. ముందస్తుగా పోలీసులను ట్రాఫిక్ ను నియంత్రించి అంతిమయాత్రకు ఆటంకాలు లేకుండా చేశారు.