జనసేన సైనికులు ఏం చెప్పారు?: టీడీపీకి పవన్ మద్దతునివ్వకపోవడం వెనుక 'రియాలిటీ'!
జనసేన అభిమానులు టీడీపీపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు: 2014సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో ఎవరితో జోడీ కడుతారన్న దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. విడిగా రాజకీయాలు నడుపుతున్నట్లు కనిపించినా.. ఆయన వైఖరి చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటుందని, ఇదో లోపాయకారీ ఒప్పందమన్న విమర్శలు కూడా ఉన్నాయి.
మొన్నీమధ్యే ఉద్దానం బాధితుల సమస్య పరిష్కారానికి చంద్రబాబు-పవన్లు భేటీ అవడంతో.. వీరి మధ్య ఇంకా సఖ్యత కొనసాగుతుందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో టీడీపీతో పవన్ చెలిమి ఇంకా చెదిరిపోలేదనే చాలామంది భావించారు. ఇంతలో నంద్యాల ఉపఎన్నికలు రావడంతో ఈ చెలిమికి గట్టి పరీక్షే ఎదురైంది. టీడీపీ వైపు గనుక పవన్ నిలిచి ఉంటే.. అంతా భావించినట్లుగానే ఆయన చంద్రబాబు అనుయాయి అని తేలిపోయేది.
కానీ ఇక్కడే కాస్త తెలివిగా వ్యవహరించిన పవన్.. అసలు ఈ ఉపఎన్నికలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని తీర్మానించుకున్నారు. జనసేన ఎవరికీ మద్దతునివ్వదని, తటస్థంగా ఉంటుందని తేల్చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు విన్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
Recommended Video
ఇక్కడే ఓ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అభిమానులు టీడీపీపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు కాబట్టే పవన్ వెనక్కి తగ్గి ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి మద్దతునిచ్చినా.. ఫలితం తేడా కొడితే, పవన్ ప్రభావం తేలిపోయిందన్న అపవాదు ఉంటుంది కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉండటమే బెటర్ అని జనసేనాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పవన్ మద్దతు లేకపోవడం గెలుపును మరింత సంక్లిష్టం చేస్తుందని టీడీపీ కూడా భావిస్తోంది. అదే సమయంలో ఈ పరిస్థితి వైసీపీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పవన్ జోక్యం లేకపోవడంతో.. కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి గనుక దూరమైతే వైసీపీ లాభపడనుంది. మొత్తం మీద నంద్యాల ఉపఎన్నికకు పవన్ దూరంగా ఉన్నా.. ఆయన చుట్టూ ఉన్న సమీకరణాలు పరోక్షంగా ప్రభావం చూపనున్నాయనేది స్పష్టమవుతోంది.