బీజేపీ గేమ్ ప్లాన్: ఏపీ నుంచి రాజ్యసభకు సురేశ్ ప్రభు ఎంపిక?
అమరావతి: రాజ్యసభ సీట్ల విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య అస్పష్టత నెలకొందా? ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లను ఇక్కడి నుంచి కాకుండా రాజస్థాన్, కర్ణాటకల నుంచి ఎంపిక చేయడం బీజేపీ భవిష్యత్తు వ్యూహాంలో భాగమేనని అంటున్నారు.
తొలుత నిర్మలా సీతారామన్ను ఏపీ నుంచి రాజ్యసభకు మీడియా నుంచి పంపిస్తారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం ప్రకటించింది. రెండు సంవత్సరాల క్రితం రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిర్మలా సీతారామన్ ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఈ సారి కూడా ఆమెకు ఇక్కడి నుంచే రాజ్యసభకు పంపిస్తారని అందరూ భావించారు. కానీ, ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది. మరోవైపు ఏపీ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న వెంకయ్య కర్ణాటక నుంచి మూడు పర్యాయాలు రాజ్యసభకు వెళ్లారు.
ఈ దఫా ఏపీ లేదా కర్ణాటక నుంచి ఛాన్స్ లభిస్తుందని అందరూ భావించారు. కన్నడనాట వెంకయ్యకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం, ఆయన స్థానంలో నిర్మలకు చాన్స్ ఇచ్చిందని అనుకున్నప్పటికీ, ఏపీని వదిలి రాజస్థాన్ను ఎంచుకోవడం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం అంతు చిక్కడం లేదు.
మిత్రధర్మంలో భాగంగా బీజేపీ పెద్దలు టీడీపీని ఒక రాజ్యసభ సీటు అడిగారు. దీనికి టీడీపీ కూడా ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సీటులో మహారాష్ట్రకు చెందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే టీడీపీ దీనిని అధికారికంగా ప్రకటించికపోయినప్పటికీ, మంగళవారం మధ్యాహ్నాం ఒంటిగంటన్నర సమయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఏపీకి చెందిన వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ను ఇక్కడి నుంచి ఎంపిక చేయకపోవడాన్ని బీజేపీ గేమ్ ప్లాన్గా భావిస్తున్నారు.
భవిష్యత్తులో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు విమర్శలకు గురి కాకుండా ఉండేందుకే బీజేపీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభును ఎంపిక చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధుల విడుదల విషయంలో కూడా తీవ్ర జాప్యం చేస్తోందంటూ ఇటీవల టీడీపీ నేతలు పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే.