ఎవరికి రాని అనుమానం జగన్కే ఎందుకు: సోమిరెడ్డి
హైదరాబాద్: ఎవరికీ రాని అనుమానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికే ఎందుకు వస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. పట్టిసీమను మంచి ఉద్దేశ్యంతో తాము చేపట్టామన్నారు.
కానీ, జగన్కు అనుమానాలు ఎందుకని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు రావడం జగన్కు ఇష్టం లేదా చెప్పాలన్నారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేమిటో చెప్పాలని ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు.
పట్టిసీమను అడ్డుకునేందుకు జగన్ యత్నిస్తున్నాడన్నారు. పట్టిసీమ వల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. నదుల అనుసంధానం ద్వారా ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టుకు చేపట్టారన్నారు. సోమిరెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
చెరువుల మరమ్మతులు: దేవినేని
కృష్ణా జిల్లాలో రూ.5 కోట్లతో చెరువుల మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అధికారులను ఆదేశించారు. పైపులైన్ల నిర్మాణం చేపట్టి వేసవికాలంలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు
హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ను దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఆర్థికసాయం అందజేస్తే హైకోర్టు విభజనకు తాము సిద్ధమని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న రాజధాని నగరంలో హైకోర్టుకు స్థలాన్ని కేటాయిస్తామని తెలిపింది.