చంద్రబాబు అసహనం, జగన్కు 2 కారణాలు: అఖిలప్రియ ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెరపైకి చెల్లి, ఫ్యామిలీలో విభేదాలు..: అఖిలప్రియ షాకింగ్, వేలు జగన్ వైపా?
అయితే, ఆయన వ్యాఖ్యలు ఏ మేరకు సరైనవని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ అంశంపై జగన్, వైసిపి నేతలు ఒకే విషయం చెబుతున్నారు. ఆ సీటు తమదని, అందుకే పోటీ చేస్తున్నామంటున్నారు.
శోభా నాగిరెడ్డి చనిపోయినప్పుడు..
ఎవరైనా మృతి చెందితే, ఆ స్థానంలో వారి కుటుంబ సభ్యులను నిలబెడితే ఎవరూ పోటీ చేయవద్దనేది సంప్రదాయంగా వస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 2014లో శోభా నాగిరెడ్డి చనిపోయినప్పుడు తాము సంప్రదాయం ప్రకారం పోటీలో నిలపలేదని, ఇప్పుడు భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు వైసిపి కూడా పోటీ చేయవద్దని, కానీ వారు పోటీ చేస్తూ ఓ మంచి సంప్రదాయానికి నీళ్లు వదిలారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాజీనామాల గురించి మాట్లాడాకే సంప్రదాయం గురించి..
సంప్రదాయాన్ని మంటగలిపారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విపక్షానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయమని ఎలా మాట్లాడుతారని నిలదీస్తున్నారు. భూమా నాగిరెడ్డి తమ పార్టీ నుంచి గెలిచారని, ఆ తర్వాత టిడిపిలో చేరారని అంటున్నారు. మా పార్టీ నుంచి గెలిచి, మీ పార్టీలో చేరి, మీ పార్టీ నుంచి చేరితే సంప్రదాయం అని చెప్పడం విడ్డూరమన్నారు. అసలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారటం సరికాదని, అలాంటప్పుడు సంప్రదాయాన్ని మంట కలిపారని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించకుండా, తమ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తూ సంప్రదాయం గురించి మాట్లాడటం ఎలా చెల్లుతుందని ప్రశ్నిస్తున్నారు.
వారసత్వం.. మరో కారణం కూడా...
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పోటీ చేయడానికి మరో కారణం కూడా చెబుతోంది. అసలు భూమా బ్రహ్మానంద రెడ్డి.. భూమా నాగిరెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఆయన కుటుంబంలోని వ్యక్తులు మాత్రమే పోటీ చేస్తే టిడిపి అడగవచ్చునని, కానీ అన్న కొడుకును నిలబెట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు. టిడిపి బ్రహ్మానంద రెడ్డిని పోటీలో నిలబెట్టడం ద్వారా సంప్రదాయం గురించి మాట్లాడే హక్కు కోల్పోయిందని వైసిపి చెబుతోంది.
ఇదీ అఖిలప్రియ వాదన
భూమా బ్రహ్మానంద రెడ్డి తన తండ్రి నాగిరెడ్డి వారసుడు కాదని వైసిపి చెప్పడాన్ని మంత్రి అఖిలప్రియ ఖండించారు. తమదంతా ఉమ్మడి కుటుంబం అని, తామంతా కలిసే ఉంటున్నామని, అలాంటప్పుడు బ్రహ్మానంద రెడ్డి కూడా తన తండ్రి వారసుడే అవుతాడని చెబుతున్నారు. కాగా, 2014లో నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి వైసిపి నుంచి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. ఇప్పుడు భూమా కుటుంబం టిడిపి తరఫున, 2014లో టిడిపి తరఫున పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడు వైసిపి నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.