కన్నపిల్లల ముందే భార్య గొంతుకోసి హత్య, ఎందుకంటే?
మద్యం తాగకూడదని కోరిన భార్యను ఆమె భర్త కిరాతకంగా కన్న పిల్లల ముందే హత్య చేశాడు భర్త, తల్లిని హత్య చేయకూడదని అడ్డుపడిన పిల్లలపై కూడ దాడి చేశాడు ఆ కిరాతకుడు. భార్య చనిపోయిందో లేదోనని అనుమానించి కత్తిత
చిలకలూరిపేట: మద్యం తాగకూడదని కోరిన భార్యను ఆమె భర్త కిరాతకంగా కన్న పిల్లల ముందే హత్య చేశాడు భర్త, తల్లిని హత్య చేయకూడదని అడ్డుపడిన పిల్లలపై కూడ దాడి చేశాడు ఆ కిరాతకుడు. భార్య చనిపోయిందో లేదోనని అనుమానించి కత్తితో పొడిచి ముఖంపై దిండు పెట్టి హత మార్చాడు.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన శిఖా మాణిక్యాలరావు ఇరవై ఏళ్ళ క్రితం వనజాక్షిని వివాహం చేసుకొన్నాడు. పదిహేనేళ్ళ క్రితం వారు చిలుకలూరిపేటకు వలస వచ్చారు. మాణిక్యాలరావు తోపుడి బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. ఆయన భార్య కూలీ పనులకు వెళ్ళేది.
వీరికి బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న లెవిబాబు, కుమార్తెలు ఆషా, కృష్ణవేణిలు ఉన్నారు. రెండేళ్ల నుండి వారు కుమ్మరికాలనీని మసీదుకు సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తెకు వివాహం చేశారు.
మాణిక్యాలరావు మద్యానికి బానిసగా మారాడు.సంపాదించిన సొమ్మును మద్యానికి తగలేస్తున్నాడని భార్య వనజాక్షి భర్తతో గొడవపెట్టుకొనేది.మద్యం తాగకూడదని భార్య చెప్పిన మాటలను ఆయన పెడచెవిన పెట్టాడు.
శనివారం నాడు లెవిబాబు ఇంటి డాబాపై నిద్రిస్తున్నాడు.ఇంటి లోపల వనజాక్షి, ఆమె చిన్న కుమార్తై కృష్ణవేణి, మాణిక్యాలరావు తమ్ముడి కుమార్తై ఎస్తేర్ నిద్రిస్తున్నారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మాణిక్యాలరావు భార్యతో గొడవపడ్డాడు.
దీంతో కట్టెలు నరికే కత్తితో వనజాక్షిపై దాడి చేశాడు. ఈ సమయంలో పిల్లలు అడ్డురావడంతో వారిపై కూడ ఆయన దాడికి దిగాడు.వారు చూస్తుండగానే వనజాక్షి గొంతుకోశాడు. ఆమె చనిపోయిందో లేదోనని ఆమె ముఖంపై దిండు అడ్డంగా పెట్టి అదిమాడు.
రెండు గంటల పాటు గదికి అడ్డంగా కూర్చొని పిల్లలు బయటకు వెళ్ళకుండా అడ్డుపడ్డాడు. ఆ తర్వాత ఆయన పారిపోవడంతో పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి వనజాక్షి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.