ఎన్టీఆర్ కూతురు: పురంధేశ్వరితో చంద్రబాబుకు బిజెపి చెక్ చెప్పేనా?
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ముందుముందు ఏపీలో చెక్ పెట్టనుందా? అంటే కమలం పార్టీ ఆ దిశగా దూసుకెళ్తోందనే చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలకు టీడీపీతో కలవడం ఏమాత్రం ఆసక్తి లేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లో అధిష్టానం మాటకు కట్టుబడి వారు టీడీపీతో కలిసి వెళ్లారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా టీడీపీకి దూరంగా ఉండాలని తెలంగాణ బిజెపి నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీలోను పట్టుకోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో పలుమార్లు బిజెపి నేతలు 2019లో ఏపీలో తాము కీలకంగా మారుతామని చెప్పిన సందర్భాలున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా.. ఏపీలో 2019 నాటికి ఎదగాలని బిజెపి భావిస్తోంది.
బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా ఆ దిశగా తెలంగాణలో తెలంగాణ బిజెపి నేతలకు, ఏపీలోని నేతలకు దిశానిర్దేశనం చేశారు. ఇటీవలె బిజెపి పురంధేశ్వరికి మహిళా మోర్చా బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
తెలుగు ప్రజలు చాలామంది ఎన్టీఆర్ను అభిమానిస్తారు. విపక్షాలు కూడా ఎన్టీఆర్ విమర్శించే సాహసం చేయలేని పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా పురంధేశ్వరికి ఎన్టీఆర్ కూతురు అయినందువల్లే పట్టం కట్టింది. ఇప్పుడు బిజెపి కూడా పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించింది.
ఏపీలో బలోపేతం కోసం అన్ని విధాలా ముందుకెళ్లాలని బిజెపి భావిస్తోంది. ఇందులో భాగంగా పురంధేశ్వరి ద్వారా ఎన్టీఆర్ ఇమెజ్ బిజెపికి ఏమైనా ఉపయోగపడుతుందా ముందు ముందు తేలనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ఎన్టీఆర్ పేరు పలవరించిన విషయం తెలిసిందే.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్నది దుష్ప్రచారమని పురంధేశ్వరి సోమవారం వ్యాఖ్యానించడం గమనార్హం. 2019 నాటికి ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. మోడీ ఆమోదంతోనే రాష్ట్రానికి 11 కేంద్ర విద్యాసంస్థలు వచ్చాయని, కేంద్రం సహకారంతోనే ఏపీలో 24 గంటల విద్యుత్ అందుతోందన్నారు.