ప్రధానితో సీఎం భేటీ.. హోదాపై యనమల ట్విస్ట్, మోడీ వద్ద బాబు 'పట్టు'!
విజయవాడ: ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రులు ప్రత్యేక హోదాను ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీని కలవనున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రులు, ముఖ్య నాయకులతో చంద్రబాబు విజయవాడలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధాని మోడీతో చర్చించాల్సిన అంశాలు తదితరాలపై చర్చించారు.
అనంతరం మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. కరువే ప్రధాన అజెండాగా తాము ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు. ఇదే సమయంలో హోదా, విభజన హామీలను ప్రస్తావిస్తామన్నారు.
దేవినేని ఉమ మాట్లాడుతూ.. అవసరమైతే ప్రాజెక్టుల పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. అనుమతులు తీసుకుంటేనే ప్రాజెక్టులు చేపట్టాల్నారు. గోదావరి, కృష్ణా నది ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
విభజన హామీలు అమలు చేయాల్సిందే
ప్రధాని మోడీతో జరగనున్న భేటీలో చంద్రబాబు విభజన హామీల గురించి గట్టిగానే నిలదీయనున్నారని అంతకుముందు ఊహాగానాలు వినిపించాయి. చంద్రబాబు తన విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు.
వచ్చీరాగానే అందుబాటులో ఉన్న తన కేబినెట్ మంత్రులు, వివిధ శాఖల అధికారులను పిలిపించుకుని ప్రత్యేకంగా సమాలోచనలు చేసిన ఆయన ఢిల్లీ పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహాన్ని దాదాపు ఖరారు చేసుకున్నారు.
గతంలో మాదిరిగా కేంద్రం చెప్పిందే వినడం కాకుండా... విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టాలని చంద్రబాబు భావిస్తున్నారనే వాదనలు వినిపించాయి.
ఈ క్రమంలో రేపు పలు కీలక శాఖల అధికారులతో ఆయన వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను ప్రధాని ముందు పెట్టడంతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆయన ముందు ఏకరువు పెట్టనున్నారని అంటున్నారు.