కేసులకు బెదరను: లొంగిపోయిన భూమా నాగిరెడ్డి
కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టించిందని కర్నూలు జిల్లా నంద్యాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. హత్యాప్రయత్నం కేసులో ఆయన శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినప్పటికీ తాము స్వచ్ఛందంగా కేసు నమోదు చేశామని పోలీసులు కొత్త వాదన వినిపిస్తున్నారని ఆయన అన్నారు.
తనను, తమ పార్టీని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసులు బనాయించారని ఆయన అన్నారు. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా తాను బెదరబోనని భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజల కోసం, అభివృద్ధి కోసం ప్రశ్నించిన తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన అన్నారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినా తాను ధైర్యంగా ఎదుర్కుంటానని ఆయన చెప్పారు.
నంద్యాల డిఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట భూమా నాగిరెడ్డి శనివారంనాడు సరెండరయ్యారు. చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడుతానని ఆయన అన్నారు.
కాగా, భూమా నాగిరెడ్డి వెంట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి, జయరాం, గౌరు చరిత, ఐజయ్య, మణిగాంధీ డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన వివాదం నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై పోలీసు హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసుతో పాటు మరో మూడు కేసులు నమోదయ్యాయి.
ఆ కేసుల్లో అరెస్టు చేసేందుకు పోలీసులు శుక్రవారం అర్థరాత్రి నుంచి భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేయడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.