సిఎం చెప్పినా వినను, విడతలుగా నోటిఫికేషన్: ఘంటా చక్రపాణి
హైదరాబాద్: ముఖ్యమంత్రి చెప్పినా వినబోనని, ఉద్యోగాల భర్తీలో రాజకీయ జోక్యానికి తావులేదని, విద్యార్థుల ప్రతిభకే పట్టం కడతామని, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. తాను ఎవరి మాటా వినను కాబట్టే సీఎం కేసీఆర్ తనను టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించారని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కమిషన్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అంతకు ముందు చక్రపాణి, అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ తదితరులతో కలిసి నివాళులు అర్పించారు. చైర్మన్ పదవిని బాధ్యతగా స్వీకరిస్తున్నానని, సర్వీసులో ఉన్నంత కాలం నిజాయితీగా వ్యవహరిస్తానన్నారు. టీఎస్పీఎస్సీ కొత్తగా ఏర్పడినందున భర్తీప్రక్రియ విధానాలు రూపొందించుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. నాలుగైదు నెలల్లో ఉద్యోగాల భర్తీకి దశలవారీగా నోటిఫికేషన్ లు జారీ చేస్తామన్నారు.
రాజకీయ జోక్యం లేకుండా ఉద్యోగాల భర్తీ సాగుతుందని, నిరుద్యోగులెవరూ కమిషన్ చుట్టు తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ఫైరవీలకు తావులేదని, ఇంటర్వ్యూల కోసమే అభ్యర్థులు కమిషన్ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామక దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే ఉంటాయని, టీపీఎస్సీని దేశానికే ఒక మోడల్గా తయారు చేస్తానని ఘంటా చక్రపాణి అన్నారు. అవినీతికి తావులేకుండా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
ఉద్యోగాల భర్తీలో తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయాలని తాను ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నా చేశానని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. ఇప్పుడు, ఇదే సర్వీస్ కమిషన్ వేదికపై మాట్లాడే అవకాశం రావడం ఉద్యమ పుణ్యమేనన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.
ప్రమాణ స్వీకారం చేయించిన సీఎస్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గురువారం ఉదయం 11.23 గంటలకు సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం చక్రపాణి సభ్యులుగా నియామకం అయిన సి.విఠల్, డాక్టర్ చంద్రావతితో ప్రమాణ స్వీకారం చేయించారు.