జగన్ గూటికి ఉండవల్లి?: బాబు సర్కార్పై విమర్శలు అందుకేనా?
ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
అమరావతి/ హైదరాబాద్: ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా పని చేయడం లేదని బహిరంగ వ్యాఖ్యలతో 'ఈనాడు' రాసే వార్తాకథనాలకు ప్రతిగా 'మార్గదర్శి' చిట్ ఫండ్ సంస్థలో కుంభకోణాన్ని బయటకు తీసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సన్నిహితుడయ్యారు.
కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత స్తబ్దుగా ఉండిపోయారు. 2013 - 14లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. విభజన సమయంలో అధిష్టానాన్ని ధిక్కరించి ఏపీ ప్రజల దృష్టిలో హీరో అయ్యారు. సమైకాంధ్ర ఉద్యమ సమయంలో ఉండవల్లి ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా వినేవారు.
అనకాపల్లి మాజీ ఎంపి సబ్బంహరి, బెజవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ తదితరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి, 2014లో చివరి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. కాంగ్రెస్ వ్యవహరించిన తీరు వల్లే ఏపీలో ఆ పార్టీ భూస్థాపితమయ్యిందంటూ కుండబద్దలు కొట్టరాయన.
పోలవరంపై బాబును ఇలా నిలదీస్తున్న రాజమండ్రి మాజీ ఎంపీ
మాటల మాంత్రికుడిగా, రాజకీయ విశ్లేషణలు చేయటంలో పట్టున్న వ్యక్తిగా పేరుతెచ్చుకున్న ఉండవల్లి కాంగ్రెస్ నుంచి బయటపడిన తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. మారిన రాజకీయ పరిణామాల్లో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి మురళీమోహన్ చేతిలో ఓటమి పాలైన తర్వాత కొద్దికాలం స్తబ్దుగా ఉండిపోయారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు... కేంద్రం సవతి తల్లి ప్రేమపై అప్పుడప్పుడూ స్పందిస్తూనే ఉన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. కానీ అధికార తెలుగుదేశం పార్టీ, ఏపీ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసే ఒక మీడియా సంస్థకుఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ కార్యకలాపాలు మాత్రం అంతగా ప్రజలను ఆకట్టుకునేలా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్న వారెవ్వరైనా అధికార పార్టీని, ప్రభుత్వాధినేతను ప్రశ్నించడం సహజ సిద్ద పరిణామం. ఆ విషయాలేమీ తెలియనట్లు.. ఆంధ్రా పౌరులంతా అత్యంత అమాయకులు అన్న ధోరణుల్లో ఆ మీడియాసంస్థ వార్తాకథనాలు వండి వారుస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రాన్ని నిలదీయాల్సిన విధి రాష్ట్ర ప్రభుత్వ పని తప్ప.. విపక్షాలది కాదు. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలను కూడా కలుపుకుని వెళితే సత్ఫలితాలనిస్తుంది.
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లో ఇలా భిన్నమైన వాతావరణం
పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం వేర్వేరుగా స్పందించినా ఒకే మాట వినిపిస్తాయి. కానీ దురద్రుష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో గానీ, తెలంగాణలో గానీ అటువంటి వాతావరణం కనిపించడం లేదు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే విపక్షాలపై అణచివేత వ్యూహం అమలు చేయడం సంప్రదాయంగా వస్తున్నది. అది వేరే సంగతి. గత ఎన్నికల్లో ఐదేళ్లు ప్రత్యేక హోదా చాలదని, 15 ఏళ్లు కావాలన్నదీ ఇదే చంద్రబాబు. కానీ అధికారంలోకి వచ్చాక స్వరం ఎందుకు మార్చారు. ప్రత్యేక ప్యాకేజీతోనే ఎందుకు సరిపెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు
పిసరంత రాజకీయాలు తెలిసినవారు కూడా ఉండవల్లి అరుణ్కుమార్ను వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆయన అంటే తెలియని తెలుగువారు ఉండరు. విద్యార్థి దశలోనే జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారయన! అప్పట్లోనే అద్భుతమైన వాక్పటిమతో జనాలను ఆకట్టుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. రాజీవ్, సోనియాగాంధీ ప్రసంగాలను చక్కటి తెలుగులో అనువదిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఎదిగారు. రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న ఉండవల్లి గత రెండున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అనునిత్యం చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును, తెలుగుదేశంపార్టీని పనితీరును లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఉండవల్లిపై దేవినేని ప్రత్యారోపణలు ఇలా
ఇటీవల పోలవరం ప్రాజెక్టును దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కలిసి సందర్శించడం తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రత్యేకించి దేవినేని ఉమా మహేశ్వర రావు వంటి ఆంధ్రప్రదేశ్ మంత్రికి కంటగింపుగా మారింది. రాజకీయ నిరుద్యోగులుగా వారు ఏ పార్టీ తరఫున పోలవరాన్ని సందర్శించారో చెప్పాలని సవాల్ విసిరారు. కానీ పదేళ్ల పాటు కేంద్రంలో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ రాజకీయ వేత్తలు. వారిద్దరూ ఒకింత రాజకీయంగా నిజాయితీ పరులన్న నానుడి ఉన్నది. ఈ సంగతి తెలిసి కూడా దేవినేని ఉమా మహేశ్వర రావు వ్యాఖ్యలు చేశారంటే తమ ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న దుగ్ధే కనిపిస్తున్నదని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనబెట్టి పట్టిసీమ, పురుషోత్తమపట్నం తదితర ఎత్తిపోతల పథకాలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రధానంగా కేంద్రీకరించిందని ఉండవల్లి ఆరోపించారు.
నేడు పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ప్రారంభం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా చిత్తశుద్ధి కావాలని గుర్తు చేశారు. తాజాగా కేంద్రం సుమారు 1800 కోట్లు విడుదల చేసిందని, వచ్చే ఏడాది లోపు ప్రాజెక్టు నిర్మించి తమకు అప్పగించాలని ఆదేశించిందని బయట పెట్టారు. ఒకవేళ ప్రాజెక్టు తాము నిర్దేశించిన గడువులోగా నిర్మించకపోతే అప్పుగా మారిపోతుందని కేంద్రం హెచ్చరించిన సంగతీ గుర్తు చేశారు. ఇది సహజంగానే చంద్రబాబు ప్రభుత్వానికి కంటగింపుగానే మారుతుంది. మరోవైపు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ సంరంభం ముగిశాక చంద్రబాబు నాయుడు.. తూర్పు గోదావరి జిల్లాలో నిర్మించిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా వలసలు
కానీ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై ఉండవల్లి నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు ఇప్పుడిక ఎంత మాత్రం హాట్ కేకులు కావని ప్రజలు భావిస్తున్నారని, ఉండవల్లి వ్యాఖ్యలు నిజంగా అభివృద్ది కోసమా? లేక టీడీపీను ఇరుకునపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రయోజనం చేకూర్చటం కోసమా అని ప్రజలు సందేహిస్తున్నారని తెలుస్తున్నది. ఒక రాజకీయ పార్టీలో పని చేసిన వారంతా పరిస్థితులు తారుమారైతే ప్రత్యామ్నాయంగా ఏదో ఒక పార్టీలో చేరతారు. అలాగే 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలంతా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు టీడీపీ పక్షాన చేరిపోయారు. ఇక 1983 నుంచి 2014 వరకు చంద్రబాబును రాజకీయంగా ఎదిరించిన గల్లా అరుణకుమారి.. మారిన రాజకీయ పరిస్థితులకు తోడు తన తనయుడు గల్లా జయదేవ్ కోసం.. తమ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీలో చేరారని విమర్శలు వినిపించాయి.
ఉండవల్లిపై తెలుగు తమ్ముళ్ల విమర్శలు ఇలా
ఉండవల్లి అనుచరులంతా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా రాజమహేంద్రవరంలో జగన్ ఉండవల్లిని కలిశారు. ఉండవల్లి పదేపదే అధికారపక్షాన్నే టార్గెట్ చేయటంతో ప్రజలలో వున్న అనుమాన్ని బలపరుస్తున్నాయని, ఉండవల్లి వ్యవహారశైలిపై టీడీపీ నాయకులు ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారిక అనధికార ప్రతినిథిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాప్రయోజనార్థమే మాట్లాడుతున్నానంటున్న ఉండవల్లి వైసీపీకి ప్రయోజనం సమకూర్చేలా పని చేస్తున్నారని తెలుగుదేశం తమ్ముళ్లు గట్టిగానే నమ్ముతున్నారు. తాను చేస్తున్న విమర్శలపై వచ్చే అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోని ఉండవల్లి తన సహజశైలినే ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నట్లే కనిపిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పనులపై తాను గట్టిగా మాట్లాడటంతో టీడీపీ స్పందన అందుకు భిన్నంగా వుండే అవకాశం లేదని, అది సహజమేనని ఆయన మీడియా వద్ద, తన అనుచరుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడితో ఆయన ఆగకుండా వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవటం కూడా అంతే సహజమంటూ మాట్లాడటం తటస్థులకు కూడా మింగుడు పడని అంశంగా వుంటోందని పరిశీలకుల భావన. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ముక్తాయిస్తున్నారు.