కేసీఆర్పై రాహుల్ గాంధీ ఎఫెక్ట్: జాతీయ మీడియాలో 'గజ్వెల్'
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పడింది! సీఎం నియోజకవర్గం గజ్వెల్ పరిధిలో జరుగుతున్న ఆత్మహత్యలు మీడియాలో వస్తున్నాయి. త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించి, రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మీడియాలో కేసీఆర్ ఇలాకా గజ్వెల్ పరిధిలోని రైతు ఆత్మహత్యలపై చర్చ సాగుతోంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలపై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గజ్వెల్ ప్రాంతానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీని పైన హర్యానాలోని అరవై మంది కదిలినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ.3 లక్షలు అప్పు ఉందని తెలుసుకోని వారికి సాయం అందించేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యల పైన నిలదీసేందుకు రాహుల్ గాంధీ తెలంగాణలో త్వరలో పర్యటించనున్నారు. కాగా, తెలంగాణవ్యాప్తంగా ఇటీవల రైతుల ఆత్మహత్యలపై దద్దరిల్లింది. స్వయంగా కేసీఆర్ నియోజకవర్గంలోను ఆత్మహత్యలు జరగడంపై టీడీపీ మండిపడింది.