గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు, చిట్టీల పేరుతో మోసం
అమరావతి: అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆషాబీ అనే మహిళ ఇంటి పక్కన ఉన్న మహిళల వద్ద చిట్టీల పేరుతో కోటి 30 లక్షలు వసూలు చేసింది.
అనంతరం చిట్టీల డబ్బుని అడిగేందుకు మహిళలు రాగా కనిపించకుండా పోయింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆషాబీ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ కండక్టర్పై దాడి
సత్తెనపల్లి పట్టణంలో బస్సు అడ్డంగా ఉందని ఆర్టీసీ కండెక్టర్పై పిడుగురాళ్ల ఆర్టీవో కారు డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కండక్టర్పై దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ, తెలంగాణలో గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఉదయం 6.26 నుంచి 6.38 నిమిషాల మధ్య పుష్కరాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలంగాణ దేవాదాయ శాఖ తెలిపింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావడంతో పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఏపీ పుష్కరాల ప్రారంభ ముహూర్తం కూడా 14న ఉదయం 6.26 నుంచి 6.38 నిమిషాల మధ్యనే ఖరారు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.