పక్కించి మహిళను నరికి చంపిన శాడిస్టు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పిండి రుబ్బుకుంటున్న మహిళను పక్కింటిలో నివాసం ఉంటున్న ఓ యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. విచక్షణారహితంగా అతను ఆమె తలపై నరికాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చిరాలలోని వడ్డే నాగేశ్వర రావు బజారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
చిచ్చుల మల్లిక (33) స్థానికంగా ఉన్న ఓ షేర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చింది. రోడ్డుపై ఉన్న రోలు వద్ద పిండి రుబ్బుతుండగా పక్కింటిలో నివాసం ఉంటున్న కన్నంరెడ్డి వెంకటేశ్వర్లు అలియాస్ చిన్నా అనే యువకుడు గొడ్డలితో ఆమె తలపై నరికాడు. దాంతో రక్తమోడుతూ అక్కడికక్కడే మరణించింది.
హత్య చేసిన తర్వాత వెంకటేశ్వర్లు గొడ్డలి అక్కడే పారేసి పరారయ్యాడు. చిన్నా కొంత కాలంగా శాడిస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న మహిళలతో ఘర్షణలకు దిగుతూ దాడులకు దిగుతున్నాడు. చివరకు తల్లిదండ్రులను కూడా వేధించాడు. దీంతో వాళ్లు కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయారు.
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న చిన్నా పలుమార్లు మల్లికతో ఘర్షణ పడ్డాడు. తమ స్థలంలోకి గేదెలు వస్తున్నాయంటూ కొద్ది రోజుల క్రితం గొడవ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తరుచుగా చంపుతానంటూ మల్లికను బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని మల్లిక కుటుంబ సభ్యులు చిన్నా కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్లు చిన్నాను మందలించారు కూడా.
నిందితుడు మల్లికకు సమీప బంధువు. వరుసకు తమ్ముడవుతాడు. మృతురాలు పదేళ్ల నుంచి విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది. ఆమెకు కూతురు కూడా ఉంది. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.