సీఎం కార్యాలయానికి విషం సీసాతో మహిళ, రావెలపై లోకేష్కు ఫిర్యాదులు
విజయవాడ: విజయవాడలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయానికి ఓ మహిళ విషం సీసాతో వచ్చి బుధవారం నాడు కలకలం రేపింది. ఆమెను గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మహిళను గుంటూరు జిల్లా సత్తెనపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. స్థానిక తెలుగుదేశం నేతలు తన ఇంటిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆ మహిళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన సీఎం సమస్య పరిష్కరించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
రావెల పైన లోకేష్కు ఫిర్యాదులు
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్కు మంత్రి రావెల కిషోర్ బాబు పైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు నారా లోకేష్ను బుధవారం కలిశారు.
తమను మంత్రి పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మంగళగిరి దగ్గర హాయ్ ల్యాండ్సులో ఉంటూ నియోజకవర్గానికి రావడం లేదని చెప్పారు. కార్యకర్తల్ని కాదని కాంగ్రెస్ కార్యకర్తలకు పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో కార్యాలయం లేదని చెప్పారని తెలుస్తోంది.
జగన్కు గంటా సవాల్
ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వైసిపి అధినేత జగన్కు మంత్రి గంటా శ్రీనివాస రావు సవాల్ విసిరారు. భోగాపురంలో తనకు సెంటు భూమి ఉందని నిరూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేదంటే జగన్ తప్పుకుంటారా అన్నారు.
జగన్ మానకిస స్థితి సరిగా లేదన్నారు. అందుకే అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. వైయస్ హయాంలో కంపెనీల కోసం వేల ఎకరాల భూములు దోచుకున్నారని, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.