లిఫ్ట్ అడిగి కారు చోరీ, విదేశాల్లో ఉద్యోగాలని మోసం చేసిన మహిళ
హైదరాబాద్: గండిపేట వెళ్లేందుకు లిఫ్ట్ అడిగిన అగంతకులు ఇన్నోవా కారుతో ఉడాయించిన సంఘటన జరిగింది. కూకట్ పల్లికి చెందిన సునీల్ ఇన్నోవా కారు డ్రైవర్. బుధవారం గండిపేట వద్ద ఉన్న ఓనర్ను తీసుకు వచ్చేందుకు బయలుదేరాడు. లంగర్ హౌస్ వద్ద ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడిగారు. నార్సింగి వద్ద తన ఫోన్ రాచార్జి కోసం కారు ఆఫి తాళాలు కారులోనే వదిలి వెళ్లగా.. అగంతకులు కారుతో ఉడాయించారు.
మహిళ ఆత్మహత్య
నగరంలోని బోడుప్పల్లో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండటంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయస్సు 28. పల్లవి, ప్రసాద్లు భార్యాభర్తలు. పెళ్లైన కొత్తలో వారు అన్యోన్యంగా జీవించారు. అనంతరం తగాదాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అదనపు కట్నం కోసం తన కూతురును ఆమె భర్త వేధించాడని పల్లవి తల్లిదండ్రులు ఆరోపించారు. పెళ్లి సమయంలో తాము ఐదు లక్షల డబ్బులు, రెండు వందల గ్రాముల బంగారం ఇచ్చామని, అయినప్పటికీ అదనపు కట్నం కోసం భర్త మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపిస్తున్నారు.
మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. పల్లవి బుధవారం విషం తాగింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి పంపించారు. అక్కడే ఆమె తర్వాత మృతి చెందారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విదేశాల్లో ఉద్యోగాలంటూ మహిళ మోసం
విదేశాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఓ మహిళను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాదులోని కార్ఖాన ప్రాంతానికి చెందిన వర్జీనియా జేవియర్ అమీర్ పేట లాల్ బంగ్లా ఎదురుగా గల ఓ అపార్టుమెంట్స్లోని కన్సల్టెన్సీని ప్రారంభించారు.
అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లోని వివిధ పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇంటర్నెట్లో ఓ వెబ్ సైట్ ప్రారంభించారు. మూడేళ్ల క్రితం కొందరికి ఉద్యోగాలు ఇప్పించారు. అయితే, గత మూడేళ్లలో ఒక్కొక్కరి నుండి రూ.50 నుండి 70 వేల వరకు ఆమె డబ్బులు వసూలు చేశారు. ఎంతకు ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.