వ్యభిచారం నెపంతో మహిళను వివస్త్రను చేసి చితకబాదారు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని వడ్డిపల్లి గ్రామంలో మంత్రాలు, వ్యభిచారం నెపంతో గౌరీబాయి అనే మహిళపై గ్రామస్థులు అత్యంత దారుణంగా దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి చితకబాదారు.
వివరాలు ఇలా ఉన్నాయి - కళ్యాణి దుర్గానికి చెందిన గౌరీబాయి పది సంవత్సరాల క్రితం హిందూపురం ప్రాంతానికి వలస వచ్చింది. వడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఒక షెడ్ వేసుకుని జీవనం సాగిస్తోంది. అయితే ఇదే స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని స్థానికులు బావించారు.
ఈ క్రమంలో ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా గ్రామస్థులు ఆమెతో గొడవ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కల్పించుకున్న పోలీసులు మహిళకు వేరే చోట నివాసం ఏర్పాటు చేసి ఇవ్వాలని గ్రామస్థులకు సూచించారు. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామస్థులు మంగళవారం నాడు మహిళపై దాడికి పాల్పడ్డారు.
ఇంట్లోని వస్తువులన్నింటినీ బయటపడేసి, ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే, గ్రామస్థులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఆ మహిళ మంత్రాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. దానికితోడు, ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకుని వ్యభిచారం నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు.