ఆ లక్ష కోట్లు ఏం చేస్తామంటే..: జగన్పై యనమల, తమిళనాట టీడీపీ పోటీ
తిరుపతి: అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని, ఇప్పటికే రూ.43వేల కోట్లను అటాచ్ చేశామని, వాటిని ప్రజల కోసం ఖర్చు చేస్తామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
అవినీతి, దోపిడీతో కాంగ్రెస్ గత పదేళ్లలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందన్నారు. అంబేడ్కర్ కలలు కన్న అభివృద్ధి సాధనే టిడిపి లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కుట్ర, కుయుక్తులకు పాల్పడుతోందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏపీని నెంబర్ వన్ చేయాలని టిడిపి లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
నాడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. వాటిని రాష్ట్రం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులు రూ.43వేల కోట్లు ఉన్నాయని, అటాచ్ చేయని ఆస్తులు ఇంకా ఉన్నాయన్నారు. దాదాపు లక్ష కోట్లకు పైగా దోచుకున్నారన్నారు.
జగనే కాకుండా ఇంకెవరు అవినీతికి పాల్పడినా వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అటాచ్ అయిన జగన్ ఆస్తులను రాష్ట్రం కోసం చంద్రబాబు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అన్నారు. వైసిపిది అక్కడి నుంచే పుట్టుకు వచ్చిందన్నారు.
ఈ రోజు సాక్షి, ఇతర కొన్ని పత్రికల్లో చూశామని, టిడిపిని కొందరు ఎలా టార్గెట్ చేసుకుంటున్నారో అర్థమవుతోందన్నారు. టిడిపిని గతంలోను ఎన్నోమార్లు లక్ష్యంగా చేసుకున్నారని, కానీ ఇప్పటి వరకు ఎవరూ ఏం చేయలేకపోయారన్నారు. భవిష్యత్తులోను ఏం చేయలేరన్నారు.
విభజన సమయంలో ఎవరితోను సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తయారు చేసిందన్నారు. దీంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేయాలని తాము కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు. ఏపీకి సాయం కోసం తాము భవిష్యత్తులోను పోరాడుతామన్నారు.
కేంద్రం నుంచి మనకు నిధులు కావాలన్నారు. వాటితో మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. కేంద్రం నుంచి తీసుకు వచ్చే నిధుల విషయంలో టిడిపి వెనుకడుగు వేయదన్నారు. ఇప్పటికే కొన్ని నిధులు వచ్చాయని, మరిన్ని రావాల్సి ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల విషయంలో ఎవరితోను కాంప్రమైజ్ కామని చెప్పారు. 2014లో ప్రజలు చంద్రబాబు పైన నమ్మకంతో గెలిపించారన్నారు. భారత దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని చేయడమే చంద్రబాబు, టిడిపి లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు.
కాంగ్రెస్ ఇప్పటికే జాతీయ పార్టీ స్థాయి నుంచి దిగజారుతోందన్నారు. ఓ రోమన్ ఎంపర్లా పడిపోయిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో లేకుండా పోయిందన్నారు. బీజేపీ మాత్రం అంతకంతకూ ఎదుగుతోందన్నారు. బీజేపీకి ప్రతిపక్షం లేకుండా పోయిందన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు జాతీయస్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు. జాతీయస్థాయిలో టిడిపి పాత్రను దేశంలో ఎవరూ మర్చిపోలేరన్నారు. నాడు ఎన్టీఆర్ అయినా, నేడు చంద్రబాబు అయినా కేంద్రంలో చక్రం తిప్పుతున్నారన్నారు.
మనది ఇప్పుడు జాతీయ పార్టీ అయినప్పటికీ... అంతకుముందే జాతీయస్థాయిలో ప్రభావం చూపామన్నారు. రాబోయే రోజుల్లో అండమాన్ తదితర ప్రాంతాల్లోకి వెళ్తామని చెప్పారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే స్వచ్ఛమైన పాలన అందాలన్నారు. టిడిపి జాతీయ పార్టీ అంశంపై యనమల తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడారు. ఏపీ, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పారు.