చిక్కుల్లో మంత్రి యనమల: సోదరుడిపై ఫిర్యాదు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చిక్కుల్లో పడినట్లున్నారు. ఆయన సోదరుడిపై ప్రియాంక హేచరీస్ యజమాని గుణ్ణం చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రికి చిక్కులు వచ్చి పడినట్లే కనిపిస్తోంది. పది లక్షల రూపాయలు ఇస్తావా లేక చస్తావా అంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు, తుని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి యనమల కృష్ణుడు తనను బెదిరిస్తున్నారని గుణ్ణం చంద్రమౌళి ఆరోపించారు.
ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్కు సోమవారం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. యనమల రామకృష్ణుడి సోదరుడిపై ఆయన ఆరోపణల మీద ఆరోపణలు చేశారు. హేచరీల నుంచి యనమల కృష్ణుడు భారీగా వసూలు చేశారని, తనను కూడా రూ. పది లక్షలు అడిగారని, ఇవ్వలేదన్న కోపంతో రౌడీలను పంపి హేచరీ పగులగొట్టించారని, చంపుతానని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాను.
తను ఎస్పీని కూడా కలుస్తున్నాననిస మానవ హక్కుల కమిషన్కూ ఫిర్యాదు చేశానని చంద్రమౌళి చెప్పారు. అయితే, తొండంగి, యు.కొత్తపల్లి మండలం పరిధిలో చాలా వరకూ హేచరీలు అనుమతులు లేకుండా సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని మంత్రి యనమల సోదరుడు కృష్ణుడు హేచరీ యజమానుల నుంచి భారీగా వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో దానవాయిపేటలోని ప్రియాంక హేచరీపై దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై తొండంగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అయితే పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులో తన పేరు లేకుండా కృష్ణుడు చేసుకున్నారని హేచరీ యజమాని ఆరోపిస్తున్నారు.