ఎన్టీఆర్ పేరు వెనుక..: శంషాబాద్ ఏర్ పోర్ట్ కథ ఇది!
విజయవాడ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్నినల్కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడాన్ని తెలంగాణ ప్రాంత నేతలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీని పైన మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ శుక్రవారం స్పందించారు.
విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే అన్నారు. దేవేగౌడ ప్రభుత్వం ఉండగా కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు, మరికొందరి విజ్ఞప్తి మేరకు బేగంపేట విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ విమానాశ్రయంగా నామకరణం చేశారని, అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్రంలోనూ భాగస్వామిగా ఉండేదని చెప్పారు.
బేగంపేట విమానాశ్రయంతో రాజీవ్కున్న అనుబంధం, పెరంబదూరులో దుర్మరణానికి ముందు ఆయన చివరి ప్రయాణం ఇక్కడి నుంచే జరగడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అప్పుడు స్వాగతిచారన్నారు. ఆ తర్వాత చెన్నై విమానాశ్రయంలో అంతర్జాతీయ టర్మినల్కు అన్నా పేరు, డొమెస్టిక్ టర్మినల్కు కామరాజ్ పేరు పెట్టారన్నారు.
ఈ నేపథ్యంలో దీంతో బేగంపేట విమానాశ్రయం డొమెస్టిక్ టర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రాన్ని కోరానని, ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్, ఎన్టీఆర్ డొమెస్టిక్ టెర్మినల్గా నామకరణం చేశారని గుర్తు చేశారు.
తర్వాత విమానాశ్రయం శంషాబాద్కు మారిన ప్పుడు కూడా ఈ పేర్లు కొనసాగించాల్సిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం రాజీవ్ పేరే పెట్టిందన్నారు. ఎన్టీఆర్ పేరును విస్మరించిందని, ఆ పొరపాటును కేంద్రం ఇప్పుడు సరిదిద్దిందన్నారు. ఇది రాజీవ్ను కించపరచడం కాదని, ఎన్టీఆర్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఆరాధ్య దైవమన్నారు. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్ది, దేశం తలెత్తుకునేలా చేసిన పీవీ నరసింహరావు స్మారక స్థూపాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలన్నారు.