ప్రత్యేక హోదా: పార్లమెంట్ ఆవరణంలో ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం ఈ ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చెయ్యాలని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో మాట ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్రం అభివృద్ది చెందదని, ప్రజలకు కష్టాలు వస్తాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎంపీలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే విషయంలో సహకరించాలని అన్నారు.
గత వారం నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు తాము ఇలాగే ఆందోళనలు చేస్తామని వైసీపీ ఎంపీలు అంటున్నారు.