ప్రేమించిన యువతి మాట్లాడలేదని!: ఊహించని నిర్ణయంతో.. దు:ఖంలో తల్లిదండ్రులు..
కోటమ్మతల్లి పండుగ నేపథ్యంలో.. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లుంటాడని తల్లిదండ్రులు తొలుత భావించారు. ఆ రాత్రి వీరబాబు ఇంటికి తిరిగిరాకపోవడంతో భయాందోళనకు గురయ్యారు.
విశాఖపట్నం: ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడటం లేదన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా నాతవరం గ్రామానికి చెందిన గోల్లి వీరబాబు(18) ఈ చర్యకు పాల్పడ్డాడు.తమ కుటుంబానికి పశువుల పాకలో అతను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు.
ఎస్ఐ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాతవరం గ్రామానికి చెందిన గోల్లి వీరబాబు ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్ వెళ్లాడు. 10రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన అతను.. ఈ నెల 19న ఊరిలో జరిగే కోటమ్మతల్లి పండుగ కోసం ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు సాయంత్రం సైకిల్ పై ఇంటినుంచి బయటకు వెళ్లిన అతను.. మళ్లీ ఇంటికి రాలేదు. ఫోన్ చేసేందుకు ప్రయత్నించినా.. ఎంతకీ కనెక్ట్ అవలేదు.
కోటమ్మతల్లి పండుగ నేపథ్యంలో.. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లుంటాడని తల్లిదండ్రులు తొలుత భావించారు. ఆ రాత్రి వీరబాబు ఇంటికి తిరిగిరాకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. 21వతేదీ నాడు వీరబాబు తండ్రి.. గ్రామానికి దూరంగా ఉన్న తమ పశువుల పాక వద్దకు వెళ్లాడు. పాకలోకి వెళ్లగానే.. వీరబాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చూసి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వీరబాబు వద్ద ఉన్న సెల్ ఫోన్ ను పరిశీలించగా.. ప్రేమించి అమ్మాయి మాట్లాడకపోవడంతోనే మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్దారణ అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం పంపించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తమ కొడుకు ఇలాంటి పనిచేస్తాడని ఊహించలేదని వీరబాబు తల్లిదండ్రులు భోరున ఏడుస్తున్నారు.