ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ టెన్షన్: హైదరాబాద్ యువకుడి అరెస్టు
హైదరాబాద్: దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఓ యువకుడు విమానాన్ని హైజాక్ చేస్తున్నానని ఎయిర్ హోస్టెస్కు చెప్పడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఈ సంఘటన మంగళవారంనాడు హైదరాబాదు సమీపంలో జరిగింది.
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానం ఎయిర్పోర్టులో దిగడానికి ముందు యూసుఫ్ అనే యువకుడు తాను విమానాన్ని హైజాక్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్కు చెప్పాడు. ఆ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ పైలట్కు, భద్రతా సిబ్బందికి చెప్పింది. దాంతో వారు యువకుడికి నచ్చజెప్పారు.
హైదరాబాదుకు చెందిన ఆ యువకుడు యూసుఫ్ను ఆర్జిఐఎ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పంగించారు. ఆ యువకుడి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాదుకు చెందిన యూసుఫ్ గత ఐదు నెలలుగా దుబాయ్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో మరో కథనం కూడా వినిపిస్తోంది. యూసుఫ్ ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడని చెబుతున్నారు. కాక్పిట్ వద్దకు వెళ్లి ఫొటో తీసుకునే ప్రయత్నం కూడా చేశాడని చెబుతున్నారు.
యూసుఫ్ పాస్పోర్టు, వీసా, గుర్తింపు కార్డులు, తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూసుఫ్ అలా ప్రవర్తించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే అతను విమానాన్ని హైజాక్ చేయాలని అనుకున్నాడా, ఎయిర్ హోస్టెస్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడా, కేవలం మానసిక స్థితి బాగా లేక అలా చేశాడా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు.