చంద్రబాబే కాదు.. ఆయన నాయనా: టిడిపిపై ఒత్తిడి, గొంతు చించుకున్న జగన్
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. నల్లపాడు వద్ద ఆయన దీక్ష ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు తెలంగాణలో ఆడియో, వీడియో టేపులో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడని మండిపడ్డారు. ఆ ఆడియోను చూసి... మన ముఖ్యమంత్రి ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడారని చెప్పిన వారు కూడా ఉన్నారన్నారు.
ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారన్నారు. రాజకీయ నాయకుల పైన కేసులు కొత్తేం కాదన్నారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో కుమ్మక్కై.. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని రక్షించి.. నా పైన కేసులు పెట్టారన్నారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. సోనియాతో కుమ్మక్కై, చీకట్లో చిదంబరాన్ని కలిసి నా పైన కేసులు పెట్టారన్నారు. అయినా నేను భయపడలేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని గట్టిగా నిలబడిన వ్యక్తి, నిలబడిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైయస్సార్ కాంగ్రెస్, వైయస్ జగన్ అన్నారు.
వాళ్లు కేసులు పెట్టగలరే కానీ, తలరాతలు రాసేది మాత్రం దేవుడే అన్నారు. చంద్రబాబు పైనున్న దేవుడిని నమ్మకుండా.. ప్రధాని కాళ్లు పట్టుకొని ప్రత్యేక హోదాను పక్కన పెట్టారన్నారు. హోదా పైన ఎన్నో అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
హోదా ఇచ్చేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో పైన వారు చెప్పిన రాష్ట్రాలు లేవా అన్నారు. ప్రత్యేక హోదా అంశం ప్రణాళికా సంఘం పరిధిలో ఉండదన్నారు. ఎన్డీసీ, కేంద్ర కేబినెట్ పరిధిలోనిది అన్నారు.
ప్రధాని నిర్ణయం తీసుకుంటే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పైన మనం ఒత్తిడి తేవాలన్నారు. హోదా కోసం చంద్రబాబుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం లేదన్నారు. ఒత్తిడి తెస్తే ఆయన 24 గంటల్లో జైలుకు వెళ్తారనే భయం ఉందన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైయస్ రాజశేఖర రెడ్డి దేవుడు అన్నారు. నేను కాంగ్రెస్ వీడగానే వైయస్ వారికి చెడ్డవాడయ్యారన్నారు. కేంద్రం నుంచి టిడిపి తప్పుకుంటే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు.
చంద్రబాబు పాలన మూడు పదాల్లో చెప్పాలంటే.. మోసం.. మోసం.. మోసం అన్నారు. దానికి తోడు వెన్నుపోటు అన్నారు. చివరకు ఆ మోసం.. అవ్వాతాతల పింఛన్ పైన కూడా పడిందన్నారు. కట్టిన ఇళ్లకు బిల్లులు కూడా ఇవ్వలేదన్నారు.
చంద్రబాబు పరిపాలనకు చరమగీతంపాడే రోజు, బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందన్నారు. అందుకోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామన్నారు. అప్పుడు చంద్రబాబు మనసు మారుతుందని, చంద్రబాబు నాయన మనసు కూడా మారుతుందన్నారు.
గొంతు చించుకున్న జగన్..
జగన్... చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చెబుతూ గొంతు చించుకొని మరీ మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు.. చేశారా? బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు... వచ్చిందా? కనీసం నిరుద్యోగ భృతి వచ్చిందా? అంటూ జగన్ గట్టిగా అరుస్తూ తరలి వచ్చిన జనాలను ఉద్దేశించి ప్రశ్నించారు.