మోడీ, నితీష్ దారిలో: బోర్లాపడ్డ జగన్ 2019 కోసం 'వ్యూహకర్త' ప్లాన్!
విజయవాడ: గత సార్వత్రిక (2014) ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఓటమి పాలైంది. ఎన్నికలకు దాదాపు పదిపదిహేను రోజుల ముందు వరకు వైసిపి గెలుస్తుందని, జగన్ సీఎం అవుతారని చాలామంది భావించారు. కానీ ఆ తర్వాత రివర్స్ అయింది.
ఈ నేపథ్యంలో మధ్యంతర ఎన్నికల పైన కూడా జగన్ ఆశలు పెట్టుకున్నట్లుగా పుకార్లు వినిపించాయి. అందుకే తాను మరో రెండు మూడేళ్లలో ముఖ్యమంత్రిని అవుతానని, మీ కష్టాలు తీరుతాయని ప్రజలతో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.
హోదా: బీజేపీపై టిడిపి ఎంపీ సంచలనం, చంద్రబాబుకి చేరడం లేదా?అయితే, ఇప్పుడు మరో రెండు మూడేళ్లు అనే మాటను పక్కన పెట్టి, 2019 ఎన్నికల కోసం వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బుధవార నాడు వైసిపి నేతలతో జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జాతీయస్థాయి వ్యూహకర్తలను రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకున్నారు. ఆ తర్వాత బీహార్లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ ఆయన సేవలను ఉపయోగించుకున్నారు. త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల్లో ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటోంది.
ఇప్పుడు వ్యూహకర్తల దారిలో జగన్ పడ్డారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో అందినట్లే అంది చేజారిన అధికారాన్ని 2019 నాటికి ఎలాగైనా పొందాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలో జాతీయ పార్టీల గెలుపు మంత్రం రాజకీయ వ్యూహకర్త సేవలను వినియోగించుకునేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కో ఆర్డినేటర్ల సమావేశంలో చెప్పారని తెలుస్తోంది. మరి జగన్.. మోడీని, నితీష్ను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ను తీసుకు వస్తారా, మరొకరిని తీసుకు వస్తారా చూడాల్సి ఉంది.