భూమాపై అశలు వదులకున్న జగన్: ఫలించిన చివరి యత్నం
హైదరాబాద్: పార్టీ మారకుండా తమ పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని నిలువరించడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకానొక సందర్భంలో ఆశలు వదులుకున్నట్లు కనిపించారు. కర్నూలు జిల్లా పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆయన శనివారం నాడు భూమా నాగిరెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, పార్టీ మారకుండా జగన్ చేసిన చివరి ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. అవకాశవాదులను ఏమీ చేయలేమని ఆయన అన్నట్లు తెలుస్తోంది. పార్టీలో భూమా నాగిరెడ్డికి తక్కువేమీ చేయలేదని ఆయన చెప్పారు. భూమాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని ఆయన చెప్పారు. గౌరవం ఇచ్చాం కాబట్టే పిఎసి చైర్మన్ పదవి ఇచ్చామని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
కర్నూలు జిల్లా శాసనసభ్యులతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. పార్టీలో కొనసాగడానికి జగన్తో జరిగిన భేటీలో భూమా నాగిరెడ్డి ఏ మాత్రం ఆసక్తి చూపలేదని అన్నారు. జగన్తో భేటీ తర్వాత భూమా నాగిరెడ్డి తన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.
Also Read: ఎవరూ మిగలరు జాగ్రత్త: వైయస్ జగన్కు టీడీపీ నేతల హెచ్చరిక
ఆ సమావేశం నేపథ్యంలోనే వైయస్ విజయమ్మ రంగంలోకి దిగి భూమా నాగిరెడ్డితోనూ అఖిలప్రియతోనూ మాట్లాడినట్లు చెభుతున్నారు. దీంతో భూమా నాగిరెడ్డి మనసు మార్చుకుని పార్టీలో కొనసాగడానికి నిశ్చయించుకున్నట్లు చెబుతున్నారు.
తాము పార్టీ మారుతున్నట్లు మీడియాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని కర్నూలు జిల్లా శాసనసభ్యులు స్పష్టం చేశారు. జగన్ తమతో ఏదో మాట్లాడినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని వారన్నారు. కేవలం జిల్లా పరిస్థితిని సమీక్షించామని ఆయన చెప్పారు.
ప్రజలను మభ్యపెట్టడానికి తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి దిగారని వారు చెప్పారు. ఇక్కడ ఉండడం వల్ల పోయేది లేదు, అక్కడికి వెళ్లడం వల్ల వచ్చేది ఏమీ లేదని అన్నారు. పార్టీ మారుతున్నట్లు తమ పేర్లు రాయడం సరి కాదని ఆయన అన్నారు. టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.
తామంతా వైసిపిలోనే ఉన్నామని వైసిపి కర్నూలు జిల్లా శాసనశభ్యులు అన్నారు. తాము ఎవరం కూడా పార్టీ మారడంలేదని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తాము జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేసినట్లు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అన్నారు.