చంద్రబాబుపై జగన్ సీరియస్గా... అదే చిక్కుముడి, ఢిల్లీలో సఫలమయ్యేనా?
ఫిరాయింపుల విషయంలో జగన్కు ఇతర పార్టీలు ఏ మేరకు మద్దతు పలుకుతాయి? గత కొన్ని సంవత్సరాలుగా ఇది సాధారణంగా మారిన పరిస్థితుల్లో ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
అమరావతి: కేబినె్ విస్తరణలో తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు చోటు కల్పించడంపై వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ, కాంగ్రెస్ తదితర జాతీయ పార్టీ ముఖ్య నాయకుల అపాయింటుమెంట్ కోరారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించడాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నారు.
కేబినెట్లో 4గురు: ఢిల్లీలో చంద్రబాబుపై దెబ్బకు జగన్ ప్లాన్, మూడ్రోజులు మకాం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 10ని సవరించాలని ఆయన కోరనున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ అధికారాల్లో మార్పులు చేయాలని, గవర్నర్కు కొత్త అధికారాల కల్పన వంటి అంశాలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించనున్నారు.
జగన్కు మద్దతు లభించేనా? ఇలా కార్నర్
అయితే, జగన్కు ఇతర పార్టీలు ఏ మేరకు మద్దతు పలుకుతాయి? గత కొన్ని సంవత్సరాలుగా ఇది సాధారణంగా మారిన పరిస్థితుల్లో ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మరో విషయమేమంటే.. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పదేపదే గుర్తు చేస్తూ జగన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఫిరాయింపుల పర్వం..
దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు కొత్తేం కాదు. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలే చేరారు. తెలుగు రాష్ట్రాలలో విషయానికి వస్తే 2004లో తెరాస నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేల్లో 16 మందిని నాటి సీఎం వైయస్ కాంగ్రెస్ వైపు లాక్కున్నారు. ఆ తర్వాత ఇవి ఇప్పటి వరకు ఇవి కొనసాగుతూ ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
2014 నుంచి తెలుగు రాష్ట్రాలలో చూస్తే తెలంగాణ, ఏపీలలో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి. 2014లో టిడిపి నుంచి గెలిచిన15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది తెరాసలో చేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నారు. దీనిని నాడు టిడిపి తప్పుబట్టింది. కానీ అదే టిడిపి ఇప్పుడు ఏపీలో నలుగురికి కేబినెట్లో చోటు కల్పించింది.
తెలంగాణలో కేవలం టిడిపి నుంచే కాకుండా కాంగ్రెస్, బిఎస్పీ, లెఫ్ట్ పార్టీల నుంచి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు అధికార తెరాసలో చేరారు. ఏపీలో వైసిపి నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలంగాణను వదిలేసి.. ఏపీని సీరియస్గా తీసుకున్న జగన్
వైసిపి, టిడిపి రెండు తెలుగు రాష్ట్రాలలోను ఉంది. తెలంగాణలో ఫిరాయింపులు, ఫిరాయింపు నేతలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వైసిపి అంత సీరియస్గా తీసుకోలేదు. అందుకు పలు కారణాలున్నాయి. ప్రధాన కారణం మాత్రం.. వైసిపి తెలంగాణను వదిలేయడమే అంటారు. కానీ తనదాకా వస్తే అనే సామెత ప్రకారం.. ఏపీలో జరిగిన అంశాన్ని మాత్రం జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు.
తలసానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు.. ఇప్పుడు వైసిపి నుంచి గెలిచిన అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు తన కేబినెట్లో చోటు కల్పించారు. అదే సమయంలో తెలంగాణలో తమ పార్టీ ఉందని చెప్పే వైసిపి.. తలసానిని కేసీఆర్ తన కేబినెట్లోకి తీసుకున్నప్పుడు అంతగా స్పందించలేదు. ఏపిలో అంశాన్ని మాత్రం వైసిపి సీరియస్గా తీసుకుంది.
వారే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారని..
రెండు రోజుల క్రితం పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తూ పురంధేశ్వరి బీజేపీ అధిష్టానానికి లేఖ రాసింది. అయితే, ఇదే నేతలు నాడు వైయస్ హయాంలో జరిగిన ఫిరాయింపుల గురించి ఎందుకు ప్రశ్నించలేదని తెలుగుదేశం పార్టీ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు.
ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తున్నందునే తమ పార్టీలోకి విపక్ష నేతలు వస్తున్నారని, అసలు ఫిరాయింపుల గురించి ఇప్పుడు చర్చ అనవసరమని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం నేతలు సంధించే ప్రశ్నల్లోనూ వాస్తవం లేకపోలేదని కొందరు చెబుతున్నారు.