ఏలూరులో జగన్ దీక్ష, బాబుది బిల్డప్: కొడాలి నాని సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 21, 22వ తేదీన ఏలూరులో దీక్ష చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆయన దీక్ష చేయనున్నారు. కాగా, వైయస్ జగన్ బుధవారం ఉదయం ఇడుపులపాయ వద్ద వైయస్సార్ ఘాట్ వద్ద గల వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమాధి వద్ద ప్రార్థించారు. జగన్ వెంట ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు.
జగన్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరి బుధవారం ఉదయం ఎర్రగుంట్లకు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడిపారు. అనంతరం చక్రాయపేట మండలం దేవరగట్టుపల్లెలో గుండెపోటుతో మృతి చెందిన వైసీపీ నేత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 25న పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఏమీ చేయని చంద్రబాబు అంతా చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ యాత్రకు భయపడే రైతులకు పరిహారం ఇస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు.
చంద్రబాబును పొగడడానికి, జగన్ను దూషించేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లుగా ఉందన్నారు. తాము ఎంతపట్టుబట్టినా కరువుపై చర్చకు అధికారపక్షం అంగీకరించలేదన్నారు. 560 మండలాల్లో కరవు నెలకొంటే 266 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. 100 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించారన్నారు.
కొడాలి నాని సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా జాస్తి వెంకటరాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందన్నారు.
అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, రాముడి కన్నా సీనియర్ అధికారికి డీజీపీ బాధ్యతలు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుండి దించివేయడంలో సహకరించినందునే రాముడిని చంద్రబాబు డీజీపీగా చేశారని నాని తన పిటిషన్లో పేర్కొన్నారు.