అసెంబ్లీ నిబంధనలు తెలియవు, ప్రశ్నోత్తరాలు వద్దనడానికి మీరెవరు?: జగన్పై యనమల
హైదరాబాద్: సభలో ప్రజా సమస్యలపై చర్చించడం వైసీపీకి ఇష్టం లేదని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. యనమల మాట్లాడుతూ ముందు ప్రశ్నోత్తరాలు జరిగే అవకాశం ఇవ్వాలని కోరారు. క్వశ్చన్ ఆవర్ తర్వాతే ప్రభుత్వం ప్రత్యకహోదాపై ప్రకటన చేస్తుందన్నారు.
ఆ తర్వాత దానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని చెప్పిన ఆయన, సీఎం ప్రకటన తర్వాత ప్రత్యేకహోదాపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతకు అసెంబ్లీ నిబంధననలు తెలియని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ అన్పార్లమెంటరీ బాష మాట్లాడుతున్నారన్నారు.
నిన్న కూడా అసెంబ్లీ సమావేశం ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిందని చెప్పారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఆందోళన చేయడం వెల్ లోకి రావడం తగదని అన్నారు. ప్రశ్నోత్తరాలు అవసరం లేదనుకునే వారు బయటకు వెళ్లిపోవచ్చని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మేం ప్రయత్నిస్తామని తెలిపారు.
సభలో ఏం చేయాలో చెప్పడానికి మీరేవరు అని వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. అనంతరం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మాట్లాడారు. సభలో మిగిలిన అంశాలన్నింటినీ వెంటనే సస్పెండ్ చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని పట్టుబట్టారు.
ప్రత్యేక హోదా కోసం మేం పోరాడితే అడ్వాంటేజ్ మీకే అయినా కూడా రాజకీయాలకు అతీతంగా మేం సహకరిస్తున్నాం ముందువరుసలో ఉండిపోరాటం చేస్తున్నామన్నారు. నిన్న అసెంబ్లీ మొదలైనా, ప్రత్యేక హోదా మీద కేవలం అర్ధగంట చర్చ జరిగిందన్నారు.
1.30కి చర్చ మొదలై 2 గంటలకు మూసేశారన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటకు, ఇచ్చిన నోట్ కు సంబంధం లేదన్నారు. ఉన్నది ఐదు రోజులే, అందులో ఒక రోజు అయిపోయిందన్నారు. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు కాబట్టి, మిగిలినవన్నీ రద్దుచేసి, దీనిపై చర్చ మొదలు పెట్టమని వైయస్ జగన్ స్పీకర్కు సూచించారు.
ముందుగా సీఎం ప్రకటన చేయమని కోరారు. అనంతరం దానిపై చర్చ జరుపుదామన్నారు. అక్కడ కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతూ చర్చకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. సభా సమయాన్ని ఐదు రోజుల నుంచి 15 రోజులకైనా పెంచండి లేదా ప్రత్యేక హోదాపై చర్చను చేపట్టండి మిగిలినవన్నీ సస్పెండ్ చేసి చర్చను వెంటనే చేపట్టండన్నారు.