'జైలుకు ఎప్పుడు వెళ్తారో తెలియక అభద్రతాభావంలో జగన్'
తాను ఎప్పుడు జైలుకు వెళ్తానో తెలియని అయోమయ, అభద్రతాభావ స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
విజయవాడ: తాను ఎప్పుడు జైలుకు వెళ్తానో తెలియని అయోమయ, అభద్రతాభావ స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
జగన్ రైతు దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రైతులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. జగన్ దీక్షను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
రైతు రుణమాఫీ జగన్కు కన్పించడం లేదా అని నిలదీశారు. రైతుల్లో ఆనందం చూడాలని తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. జగన్ ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. వారి పార్టీ నేతలు కూడా అదే ఆందోళనలో ఉన్నారన్నారు.
రైతులకు మేలు జరగడం జగన్కు ఇష్టం లేకే గుంటూరులో మే 1 నుంచి రైతు దీక్ష పేరుతో కపట నాటకం ఆడుతున్నారన్నారు.రైతుల సంక్షేమం గురించి ఆలోచించేది టిడిపి ప్రభుత్వమేనన్నారు.
పట్టిసీమ పూర్తి చేసి ఏడాదిలో రూ.2,500 కోట్లు విలువైన పంటలను కాపాడామని చెప్పారు. మిర్చికి కేంద్రం రూ.1500 బోనస్ ప్రకటిస్తే అది ఇంకా అందుబాటులోకి రాకపోయినా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు.
తొలిసారిగా మార్క్ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచిత విద్యుత్తు యూనిట్ల పరిమితిని పెంచుతూ జగ్జీవన్ జ్యోతి పేరుతో కొత్త జీవోను విడుదల చేసినందుకు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి పట్టకుండా అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.