జగన్ ఎఫెక్ట్: తెలంగాణపై కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు
విజయవాడ: తెలంగాణ అక్రమంగా నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆందోళన ప్రభావం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై పడినట్లే ఉంది. ఆ కారణంగానే అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నారని చంద్రబాబు మంత్రివర్గం మండిపడింది.
అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు చర్చించి, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పారు. ఎపెక్స్ కౌన్సిల్ చర్చించి, తెలంగాణ ప్రాజెక్టులను ఆపేయాలని ఆయన అన్నారు. ఏ ప్రాజెక్టు వచ్చినా ఇరు రాష్ట్రాలకు అంగీకార యోగ్యంగా ఉండాలని ఆయన తెలిపారు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రాజెక్టులు కడితే ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు.
తెలంగాణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని, అవసరమైతే న్యాయపోరాటం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 10 శాఖల్లో 400 కొత్త పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు.
తెలంగాణలో అనుమతులు లేకుండా కడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే విషయంలో కేంద్రం చొరవ ప్రదర్శించకపోతే కోర్టుకు ఎక్కాలని మంత్రివర్గం నిర్ణయించింది.
భోగాపురం విమానాశ్రయానికి రెండు దశల్లో భూ సేకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మొదటి దశలో 2 వేల ఎకరాలు సేకరిస్తారు. బందరు పోర్టుకు మొదటి దశలో 6 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తారు. భోగాపురం, గన్నవరం, తిరుపతి ఎయిర్ పోర్టులకు హడ్కో నుంచి రూ. 1500 కోట్ల రుణం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
రాజధాని అమరావతి పరిధిలో మౌలిక వసతుల కల్పన కోసం కమిటీలను నియమించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో యోగా నేర్పించాలని కేబినెట్ నిర్ణయించింది. కేబీనెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో పార్టీ సమన్వయ కమిటీ భేటీ అయింది.