ప్రత్యేక హోదా ఇష్యూ: జగన్ దీక్ష విఫలమా, సఫలమా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేసినా, ధర్నాలు చేసినా ప్రత్యేక హోదా విషయంలో ఏ విధమైన ఉపయోగం ఉండదని తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అంటూ వచ్చారు. వాయిదాలు, పోలీసుల అనుమతి నిరాకరణ తర్వాత ఎట్టకేలకు వైయస్ జగన్ ఈ నెల 7వ తేదీన గుంటూరులోని నల్లపాడు వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు.
ఆరు రోజుల పాటు ఆయన దీక్ష చేశారు. మంగళవారం తెల్లవారు జామున పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. ప్రత్యేక హోదా విషయంపై ఆయన సాధించకుండానే దీక్ష ముగిసిందనే అభిప్రాయం కలగడం సహజం. అది నిజం కూడా. కానీ, ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేయడంలో ఆయన దీక్ష విజయం సాధించినట్లే. అంతేకాకుండా తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచడంలో ఆయన విజయం సాధించారని అనుకోవచ్చు.
ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేదేమిటనే విషయాన్ని కూడా ఆయన దీక్షకు ముందు ప్రజలకు వివరించడానికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఎపికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అప్పటి యుపిఎ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ, పదేళ్లు కావాలంటూ బిజెపి నాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మరీ పట్టుబట్టారు. ఆ దృశ్యాలను ప్రజలు టీవీ చానెళ్లలో చూశారు.
ప్రత్యేక హోదా వల్ల ఏమీ ఒరగకపోతే వెంకయ్య నాయుడు అప్పట్లో అంతగా ఎందుకు పట్టుబట్టారనేది ప్రశ్న. ఎన్నికల సమయంలో కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదేళ్లు కూడా కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం తాను ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితిలో లేనని చెబుతోంది.
దాదాపుగా, ఎపికి ప్రత్యేక హోదా రాదని తేలిపోయిన సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. మరోవైపు, ప్రత్యేక హోదాపై కొన్నాళ్లు వేచి చూద్దామని బిజెపి, టిడిపి కూటమికి విజయానికి కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదాకు మించిన ఆర్థిక ప్యాకేజీలు, ఇతర సాయాలు కేంద్రం అందిస్తుందని చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి తదితరులు చెబుతూ వస్తున్నారు.
కేంద్రం ఇచ్చేది విభజన బిల్లులో ఉన్నవి మాత్రమేనని, అదనంగా ఇచ్చేవేమీ లేవని జగన్ అంటున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి తప్పుకోవాలనేది ఆయన వాదన. అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి జగన్ దీక్ష చేపట్టారని అనుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేతగా, ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ బలాన్ని పెంచుకుని, క్యాడర్కు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆయన దీక్ష పనికి వచ్చిందని భావించవచ్చు.