సిఎం.. ఆఫీసులో ఏం చేస్తున్నారో తెలుస్తోంది: జగన్
హైదరాబాద్: లెక్కల్లో తేడాలు చూపిస్తూ రాష్ట్ర పరువును బజారులో పడేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడారు. ఇది కంప్యూటర్ యుగమని, అందరికీ అన్ని విషయాలూ తెలిసిపోతున్నాయని ఆయన అన్నారు.
అందువల్ల ఇప్పుడు ఏమైనా చేయచ్చు, అబద్ధాలు చెప్పచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అనుకుంటే కుదరదని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం చేస్తున్నారో కూడా అందరికీ తెలుస్తోందని చెప్పారు. గతంలో రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు తక్కువ వడ్డీ ఉండటంతో సంతోషంగా ఉండేవారని, ఇంతలో మన ఖర్మ కొద్దీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో డ్వాక్రా గ్రూపుల అక్కా చెల్లెమ్మలు 18 శాతం వడ్డీ కట్టుకోవాల్సి వస్తోందని అన్నారు.
ఇక గృహ నిర్మాణం విషయానికి వస్తే.. 5.60 లక్షల ఇళ్లు సగంలో ఆగిపోయి ఉన్నాయని, ఇవి వేర్వేరు దశల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటికి బిల్లులు ఆపేయాలని ఒక జీవో విడుదలైందని అన్నారు. వీటి
'ఓ మంత్రిగారు పింఛన్ల గురించి మాట్లాడారు. రోజుకు 27 రూపాయలు మించి ఆదాయం ఉన్నవాళ్లు పేదలు కారని కేంద్రం చెబుతోంది. కానీ ఏడాదికి 60వేలు వచ్చినా వాళ్లు పేదలేనని దివంగత నేత వైయస్ చెప్పారు. కేంద్రం చాలీచాలని విధంగా 10 శాతం మందికి కూడా సరిపోని విధంగా ఇచ్చారు' అని చెప్పారు.
అప్పటివరకు 15 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే, వైఎస్ హయాంలో అవి 38 లక్షలకు వెళ్లాయని తెలిపారు. పుష్కరాల గురించి మాట్లాడుతూ.. ‘రూ. 1400 కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. కానీ రూ. 200 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబుగారు సభలో చెప్పారు. ఈ లెక్కల్లో తేడాలేంటో మాకు అర్థం కావట్లేదు' అని వైయస్ జగన్ అన్నారు.