పులివెందులకే సీఎం పదవి: జగన్ సంచలనం, అధికారులకు హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ .. నిర్వక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను హెచ్చరించారు.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ .. నిర్వక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను హెచ్చరించారు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గురువారం ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. మండలంలోని 16 పంచాయతీల ప్రజాప్రతినిధులు, ప్రజలతో విడివిడిగా సమావేశమయ్యారు.
పులివెందులకు సీఎం పదవి
ఈ సందర్భంగా.. ‘పులివెందుల నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో సీఎం పదవి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఇప్పటికైనా జరిగినవి మరచిపోయి నిజాయితీగా పనిచేయండి' వైయస్ జగనమోహనరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించారు.
రాత్రి వరకూ కొనసాగిన సమావేశం..
కాగా, గురువారం ఉదయం ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ప్రధానంగా తాగునీటి సమస్యపైనే సమావేశంలో చర్చించారు. ఏయే పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ సత్వరమే తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జగన్ సూచించారు.
నిధులు వెచ్చించినా ఫలితం లేదు..
కొన్ని గ్రామాల్లో ఎంపీ నిధులతో తాగునీటి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించినా ఉపయోగం లేకుండా పోతోందని మండిపడ్డారు. వేసవి సమీపించడంతో తాగునీటి కొరత ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేసైనా నీటిని సరఫరా చేయాలని కోరారు.
అధికారులకు హెచ్చరిక
సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈపై పలువురు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. ఏఈ డబ్బు కోసం పీడిస్తున్నాడని, ఎవరు డబ్బులిస్తే వారి తాగునీటి బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారన్నారు. డబ్బు ఇవ్వని వారిని ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గానిదే సీఎం పదవని, అప్పుడు మీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తానని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి,పాల్గొన్నారు.