'ఆ టెక్నాలజీ ఘనత జగన్దే, ఆర్థిక శాస్త్రవేత్తలు ముక్కుమీద వేలు'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఆదివారం డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేసి టన్నులు, స్టాక్ల వ్యవహారం తేల్చాలన్నారు.
దొంగతనాలకు టెక్నాలజీ వాడిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ప్రపంచ దేశంలోనే దొంగతనాలకు, దోపిడీకి, ప్రజాధనాన్ని కొట్టేయడానికి టెక్నాలజీని వాడుకున్న ఘనత జగన్దే అన్నారు. జగన్ వద్ద ఎన్ని టన్నుల స్టాక్ ఉందో బయటపెట్టాలని ఆయన ఎద్దేవా చేశారు.
జగన్ అవినీతి తవ్విన కొద్ది బయటకు వస్తోందన్నారు. జగన్ విషయం తెలుసుకుని ఆర్థిక శాస్త్రవేత్తలందరూ ముక్కుమీద వేలు వేసుకుంటున్నారన్నారు. దొంగతనానికే జగన్ కొత్త బాష్యం చెప్పారన్నారు. ఈ టన్నుల గొడవను సుప్రీం కోర్టు ముందు ఉంచాలన్నారు.
కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ శనివారం నాడు మరో ఆధారాన్ని కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్కు హవాలా రూపంలో సొమ్ము అందిన అంశానికి సంబంధించిన ఆధారాలను సేకరించిన సీబీఐ వర్గాలు వాటిని కోర్టుకు ఇచ్చాయి. అందులో టన్నులు అంటే రూ.కోట్లు అని సీబీఐ తేల్చిన విషయం తెలిసిందే.