ఉప ఎన్నికపై మాట్లాడేది లేదు: భూమాకు డోర్లు తెరిచేందుకు జగన్ నో
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని వైసిపి అధినేత జగన్ వద్దకు కూడా పంపించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.
ఈ విషయం జగన్ చెవిలో పడిందని, దీనికి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే భూమా కుటుంబం వైసిపిని వీడి టిడిపిలో చేరడాన్ని జగన్ ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు.
సాధ్యమైనంత మేరకు ఏకగ్రీవం కోసం..
భూమా బ్రహ్మానంద రెడ్డిని నంద్యాల నుంచి బరిలో దింపుతున్న టిడిపి సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం చేయాలని చూస్తోంది. ఇందుకోసం మంత్రి భూమా అఖిలప్రియ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వైసిపి నేత, బ్రహ్మానంద రెడ్డి బంధువు కాటసాని రామిరెడ్డి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రంగంలోకి బ్రహ్మానంద రెడ్డి కూడా...
ఇప్పటికే ఏకగ్రీవం కోసం వ్యక్తిగతంగా భూమా కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగా వైసిపి నేతల వద్దకు బ్రహ్మానంద రెడ్డిని కూడా అధికార పార్టీ పంపించే అవకాశాలున్నాయి. అవసరమైతే ఆయన జగన్ను కూడా కలువవచ్చునని అంటున్నారు.
అనుమతిచ్చేందుకు జగన్ నో
జగన్ మాత్రం భూమా కుటుంబ సభ్యులను కలిసేందుకు, ఏకగ్రీవం కోసం వారితో మాట్లాడేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. లోటస్ పాండుకు కనుక బ్రహ్మానంద రెడ్డి లేదా ఇతరులు ఎవరు ఏకగ్రీవం కోసం వచ్చినా నో చెప్పాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
బరిలో శిల్పా మోహన్ రెడ్డే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి శిల్పా మోహన్ రెడ్డినే బరిలోకి దించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. నంద్యాల ఇంచార్జి రాజగోపాల్, ఇతరులు ఎవరికి అవకాశం దక్కేలా కనిపించడం లేదు. శిల్పా మోహన్ రెడ్డి టిక్కెట్ గురించే పార్టీలోకి వచ్చిన విషయం తెలిసిందే.