సెక్యూరిటీ లేకుండా వెళ్తే రాళ్లతో కొడ్తారు: బాబుపై జగన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లగలరా అని ప్రశ్నించారు. అలా వెళ్తే, జనాలు రాళ్లతో కొడతారని అన్నారు.
రైతు భరోసా యాత్రలో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలోని కాదలూరులో రైతులు, మహిళలతో వైయస్ జగన్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు.. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఆనందంగా ఉన్నారంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
రైతు రుణమాఫీలను చంద్రబాబు మరిచిపోయారని, దీంతో రైతులపై అదనపు వడ్డీ భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
హంద్రీనీవా పనులను దివంగత సిఎం వైయస్సార్ 85శాతం పూర్తి చేశారని వైయస్ జగన్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కేటాయించిన రూ. 212 కోట్లు కరెంటు బిల్లులకు చాలవని ఎద్దేవా చేశారు.