ఏం అడగొద్దా: బాబుపై మళ్లీ నోరు జారిన జగన్, కానీ, అఖిలను నిలదీయొద్దా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సీఎం చంద్రబాబుపై మరోసారి నోరు పారేసుకున్నారు. చంద్రబాబుకు నడిరోడ్డుపై ఉరిశిక్ష వేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సీఎం చంద్రబాబుపై మరోసారి నోరు పారేసుకున్నారు. చంద్రబాబుకు నడిరోడ్డుపై ఉరిశిక్ష వేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అఖిలప్రియ అపాయింటుమెంట్ అడిగితే పవన్ కళ్యాణ్ ఇవ్వలేదా?
ఉరిశిక్ష విధించమంటే తప్పా?
ఆయన గోస్పాడు దీబగుంట్లలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబు మాట తప్పినందుకు ఉరిశిక్ష విధించమని అంటే తన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారా అని నిలదీశారు. మూడేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
మంత్రులు అయితే నిలదీయవద్దా?
తమ పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు. అలా కొనుగోలు చేస్తే మాట్లాడవద్దా అని నిలదీశారు. అందులో కొందరిని మంత్రులుగా చేస్తే అడగవద్దా అని మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏం చేసినా ప్రశ్నించవద్దా అన్నారు.
ఎందుకు ప్రశ్నించొద్దు
ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు, తప్పులు చేసినప్పుడు తాను ప్రశ్నిస్తే తప్పేమిటని జగన్ నిలదీశారు. మోసం చేసిన వ్యక్తిని ఎందుకు ప్రశ్నించవద్దో చెప్పాలన్నారు. ఇలాంటి మోసం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధించినా తప్పులేదంటానని వ్యాఖ్యానించారు. మాట తప్పినందుకు ఉరిశిక్ష విధించాలంటే దిష్టిబొమ్మలు కాల్చివేయడం విడ్డూరమన్నారు.
కర్నూలుకు ఈ హామీలు
తాము అధికారంలోకి వస్తే కర్నూలుకు రైల్వే వ్యాగన్ల మరమ్మతు ఫ్యాక్టరీ తీసుకు వస్తామని, కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని, ట్రిపుల్ ఐటీ తీసుకు వస్తామని, హైదరాబాద్ - బెంగళూరు కారిడార్ ఏర్పాటు చేస్తామని, మైనింగ్ స్కూల్, ఎయిర్ పోర్ట్, ఫుడ్ పార్క్.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారన్నారు.
జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడారా?
నంద్యాల బహిరంగ సభలో జగన్ ఇటీవల చేసిన కాల్చివేత వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆయనకు ఈసీ నోటీసులు ఇచ్చింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే, ఈ రోజు ఉరిశిక్ష విధించాలన్నారు. ఈ వ్యాఖ్యలను మాత్రం టిడిపి నేతలు తప్పుబట్టలేరని అంటున్నారు. కాల్చివేత అంటే నేరుగా మాట్లాడటం. ఉరిశిక్ష అంటే మాత్రం మరోలా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించి మాట్లాడారని అంటున్నారు.
జగన్ వివరణ అందింది
సీఎం చంద్రబాబుపై ప్రతిపక్షనేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ అందిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్లాల్ గురువారం తెలిపారు. ఆ ఘటనపై కలెక్టర్ను నివేదిక అడిగామని, నివేదిక రాగానే పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు చెప్పారు. మంత్రులతో పాటు కొందరు నేతలపైనా తమకు ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.