చంద్రబాబుపై లేఖ: వైయస్ జగన్కు ప్రధాని నరేంద్ర మోడీ నో చెప్పినట్లే!!
అమరావతి: నల్ల ధనం పైన అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచింది. హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి నల్లధన పథకం కింద రూ.10వేల కోట్లు ప్రకటించారని వార్తలు వచ్చాయన్న అంశం చర్చనీయాంశమైంది.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మధ్య కూడా విమర్శ, ప్రతి విమర్శలు నడిచాయి. చంద్రబాబు ఎవరి పేరును ప్రస్తావించనప్పటికీ, మంత్రులు మాత్రం ఆ పదివేల కోట్ల రూపాయలు ప్రకటించింది జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్ల ధన పథకం కింద వెల్లడించిన వివరాలు బయటకు రావని, అలాంటప్పుడు జగన్ పేరు టిడిపి నేతలకు ఎలా తెలిసిందని, అంటే నారా లోకేష్ బినామీ, చంద్రబాబు బినామీ వెల్లడించినట్లుగా కనిపిస్తోందని వైసిపి ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో నల్ల ధనం గురించిన వివరాలు చంద్రబాబుకు ఎలా తెలిశాయని, వివరాలు బయట పెట్టాలని జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
అయితే, జగన్ కోరినట్లుగా వివరాలు బయట పెట్టే అవకాశాలు మాత్రం లేదని చెప్పవచ్చు. తాజాగా, సమాచార హక్కు చట్టం కింద నల్ల ధన వివరాలు కోరగా.. వెల్లడించలేమని ఆర్థిక శాఖ నిరాకరించింది. అధికారిక లెక్కలు లేవని చెప్పింది.
దేశంలో, దేశం వెలుపలా భారతీయులు దాచుకున్న నల్లధనంపై మూడేళ్ల క్రితం తమకు అందిన మదింపు నివేదికల్ని బహిర్గతం చేయలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని వెల్లడించడం పార్లమెంటు హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పేర్కొంది.
ఢిల్లీ, ఫరీదాబాద్లలోని మూడు సంస్థలు కలిసి ఈ మదింపు నివేదికను రూపొందించాయి. నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నివేదికలను, వీటిపై ప్రభుత్వ స్పందనను స్థాయీ సంఘం ద్వారా పార్లమెంటుకు సమర్పించాల్సి ఉందని వెల్లడించింది. ఈ దశలో సమాచారాన్ని వెల్లడించడం సభాహక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. దేశవిదేశాల్లోని నల్లధనంపై అధికారిక అంచనా ఏదీ ప్రస్తుతం లేదని తెలిపింది.